Sunday, February 22, 2009

శ్రీ శివ సాయి క్షేత్రం, కంచికచర్ల

తలపాగా ధరించిన సాయిబాబా
కంచికచర్ల -- విజయవాడ రోడ్డులో ఆంజనేయస్వామి భారీ విగ్రహం
శ్రీ శివ సాయి క్షేత్ర ప్రవేశ ద్వారం

ఆలయంలో జంట నాగుల శిల్పం


ఉపాలయాల దృశ్యం



శివాలయ మండపంలో స్తంబంపై తండ్రీ కొడుకులు


ఆలయ దృశ్వం

శ్రీ శివ సాయి క్షేత్రం, కంచికచర్ల

ఇది కొన్ని సంవత్సరాల క్రితం కట్టబడిన దేవాలయ సమూహం. జగ్గయ్యపేట -- విజయవాడ రోడ్డులో, నందిగామ దాటాక విజయవాడ బైపాస్ రోడ్డులో వున్నది. ఇక్కడ శివుడి పేరు శ్రీ అష్టోత్తర శత మహాలింగేశ్వర స్వామి. స్వామికి కుడివైపు శ్రీ మహా గణపతి, ఎడమవైపు శ్రీ పార్వతీ దేవి విరాజిల్లుతున్నారు.

ఈ దేవాలయాలకి వెనుక వైపు వరుసగా సాయిబాబా, రమా సహిత సత్యన్నారాయణ స్వామి, వీరభద్ర స్వామి, కుమార స్వామి, జ్ఞాన సరస్వతి, పంచముఖ ఆంజనేయ స్వామి, అయ్యప్ప, నవగ్రహాల దేవాలయాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే వున్న జంట నాగుల విగ్రహం ఆకర్షణీయంగా వుంది. సాయిబాబా తలపాగాతో చాలా ఆకర్షణీయంగా వున్నాడు.

దేవాలయ సమయాలు.......ఉదయం 6-00 గంటల నుంచి 12-00 గం. ల వరకు, సాయంత్రం 4-00 గం. ల నుంచి రాత్రి 8-00 గం. ల వరకు.



Wednesday, February 11, 2009

పాపి కొండలు, తూర్పు గోదావరి జిల్లా

పేరంటాలపల్లి నుంచి పాపి కొండల అందాలు
కొండల నడుమ


పాపిడి కొండలు (తర్వాత జనాల నోళ్ళల్లో పాపి కొండలు అయ్యాయి) మధ్య లాంచీల షికారు

దేవీ పట్నం పాత, కొత్త పోలీసు స్టేషన్లు

భోజనం తయార్


గండి పోచమ్మ ఆలయం


పట్టిసీమ వీరభద్ర స్వామి గుడి


ప్రయాణానికి జాబిలి రెడీ


(ఆంధ్ర భూమి 12-2-2009 సచిత్ర వార పత్రికలో ప్రచురించబడిన నా వ్యాసం)



పాపికొండలు

అందమైన గోదావరిమీద బోటులో ఉదయం 9-00 గంటలనుంచి సాయంత్రం 6-00 గంటలదాకా గడపటమంటే ఇష్టపడని వాళ్ళుంటారా? అయితే మీరు గోదావరి జిల్లాలోని పాపికొండలు చూసేవుంటారు. ఇంకా చూడలేదా అదేమిటండీ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ కొండలలో సగందాకా మునిగిపోతాయి.. మన రాష్ట్రంలో వుండి, కనుమరుగు కాబోతున్న ఈ అందాలను మనం చూసి ఆ ఙాపకాలను పదిలపరుచుకుని మన వారసులకు అందివ్వాలికదా. అయితే వెంటనే బయల్దేరండి.

రాజమండ్రిలో ఈ ప్రయాణానికి ఏర్పాటు చేసే టూరిస్టు అఫీసులు వున్నాయి. ఎ.పి. టూరిజం వారు కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాదు నుంచి కూడా రిజర్వు చేసుకోవచ్చు. ఈ ప్రయాణం రెండు రకాలు. మొదటిది ఉదయం 7-30 కి బయల్దేరి మళ్ళీ రాత్రి 8-00 గం. కి తిరిగి వచ్చేది. ఇందులో వెళ్ళేటప్పడు గంటన్నర వచ్చేటప్పడు గంటన్నర బస్సు ప్రయాణం వుంటుంది. ఇది ట్రావెల్ ఏజెంట్సే ఏర్పాటు చేస్తారు. ఛార్జీలు టికెట్ లోనే కలసి వుంటాయి. టికెట్ ఒక రోజుకి మనిషికి 500 రూ.లు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టీ కూడా ఈ టికెట్ ఖరీదులోనే లాంచీలో ఏర్పాటు చేస్తారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ లాంచీ కేంటీన్ లో కొనుక్కోవచ్చు. మరి రెండవ ప్రయాణం భద్రాచలం దాకా. ఇది రెండు రోజుల ప్రయాణం. భద్రాచలంలో శ్రీ రామచంద్రుని ప్రత్యేక ధర్శనం చేయించాక తిరుగు ప్రయాణంలో ప్రసిధ్ధి చెందిన మద్ది ఆంజనేయస్వామి దర్శనం చేయించి తీసుకు వస్తారు. బహుశ తిరుగు ప్రయాణం బస్ లో అనుకుంటా రిజర్వు చేసుకునేటప్పడు ముందు కనుక్కోండి. ఈ ప్రయాణంలో పాపి కొండలు ఇంకా అందంగా వుంటాయంటారు. ఇప్పడు మేము వెళ్ళిన ఒక రోజు ప్రయాణం వివరాలు.


ఉదయం 7-30 కి రాజమండ్రి లోని లాంచీల రేవు దగ్గర వున్న మారుతీ ట్రావెల్స్ వారి ఆఫీసు దగ్గరనుంచి బస్ లో బయల్దేరి 8-50 కి పట్టిసం అనే వూరు చేరుకున్నాము. ( ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది కానీ ఒక రోజు ప్రయాణంలో ఈ దేవాలయ దర్శనం లేదు. దీని కోసం కొంత దూరం పడవ ప్రయాణం తర్వాత కొంత నడక వుంటుంది.) పట్టిసం రేవులో లాంచీలు సిధ్ధంగా వున్నాయి. మేము రిజర్వు చేసుకున్న జాబిలి అనే లాంచీ ఎక్కాము. 9-10 కి జాబిలి బయల్దేరింది. అల్ప పీడన ప్రభావంతో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా వున్నది. మేము పైన డెక్ మీదకెళ్ళి కూర్చున్నాము. గైడు ముందుగా ఆందరినీ పరిచయం చేసుకుంటూ మైకుతో సహా క్రిందా, డెక్ మీదా కలియ తిరిగుతూ హుషారు చెయ్యటం మొదలు పెట్టాడు. చుట్టుప్రక్కల ప్రదేశాల వివరాలు, విశేషాలు చెప్పటమేగాక కబుర్లు, జోక్సు, డాన్సులతో ప్రయాణమంతా హుషారుగా వుండేటట్లు చేశాడు.

నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి 1600 కి.మీ.లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ రోజు గోదావరి మీద మా ప్రయాణం 65 కి.మీ.లు. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కి.మీ.ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే వుంటుందిట.

రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపోతాయట. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది.


కుడివైపు దెందూరు అనే గ్రామం దగ్గర లాంచీ మొదటి సారి ఆగుతుంది. ఇక్కడ గట్టుమీద వున్న గండి పోచమ్మ అమ్మవారి దర్శనార్ధం 15 ని. ల సమయం ఇస్తారు.

దైవ దర్శనం తర్వాత సినిమా కబుర్లు. గట్టు మీద కనిపించే పూడిపల్లి అనే వూళ్ళో పల్లెటూరు వాతావరణం వున్న సినిమాలు తీస్తారుట. త్రిశూలం సినిమాలో రావు గోపాలరావు ఇల్లు గట్టుమీద కనిపిస్తుంది. ఇంకా అందాల రాముడు, ఆట, ఆపద్బాంధవుడు, ఇలా ఎన్నో సినిమాలు అక్కడ రూపు దిద్దుకున్నాయి. తర్వాత దేశ భక్తి, చరిత్ర. అల్లూరి సీతారామరాజు చరిత్రలో వినిపించే దేవీ పట్నం లోని పాత, క్రొత్త పోలీసు స్టేషన్లను చూస్తాం. గట్టు మీద కనిపించే రెండు గులాబీ రంగు భవనాలు కొత్త పోలీసు స్టేషను, క్వార్టర్లు .. వాటి మధ్య కనిపించే పాత పెంకుటిల్లు బ్రిటిషు కాలంనాటి పాత పోలీసు స్టేషను.

కొండ మొదల అనే ఇంకో గ్రామం గురించి గైడు చెప్పిన సంగతి వింటే వెంటనే ఆ వూరు వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళటానికి రోడ్లు వగైరాలేమీ లేవు. ఇంకో విశేషం అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే ఇప్పటికీ బార్టరు సిస్టమే అంటే వస్తువులిచ్చి పుచ్చుకోవాల్సిందేగానీ, మీ డబ్బులక్కడ చెల్లవు.

ఇంత వెనుకబడిన గ్రామం తర్వాత వచ్చేది కొరుటూరు. ఇక్కడ ఎ.సి. నాన్ ఎ.సి. కాటేజస్ వున్నాయి. కావాలంటే ట్రావెల్స్ వాళ్ళని అడగండి.

ఇన్ని గ్రామాలను గురించి తెలుసుకుంటూ లాంచీలో జరిగే నాట్య ప్రదర్శనలు తిలకిస్తూ పాపికొండలు చేరేలోపల భోజనాలు పూర్తి చేశాము ఆ అందాలను గుండెనిండా నింపుకోవటానికి ఏ ఆటంకమూ వుండకుండా.. ప్రకృతి సోయగాలను ఇనుమడింపచేసి చూపించటానికి వరుణదేవుడు రోజులో చాలా భాగం సన్నగా కురుస్తూనే వున్నాడు. వానలో తడుస్తున్నా ఆ అనుభూతులెక్కడ కోల్పోతామోనని చాలామంది డెక్ మీదే వుండిపోయారు మాలాగే.

మా తరువాత మజిలీ పేరంటపల్లి, శ్రీ రామకృష్ణ మునివాటము అందులోని శివాలయం. లాంచీలో గైడు ముందే అక్కడ పాటించాల్సిన నియమాలు చెప్పాడు. గిరిజనులచే నిర్వహింపబడుతున్న ప్రదేశమని, అక్కడ వారికి సహాయం చేసే ఉద్దేశ్యం వుంటే ఆశ్రమ ప్రచురణలు కొనాలి తప్ప వేరే డబ్బు, వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా బాధపడతారని. ఆ ఆలయం చాలా శక్తివంతమైనదవటంవల్ల అక్కడ తగుమాత్రమే మాట్లాడాలి అదీ మంచిమాటలే. ఇక్కడ పూజారి వుండడు, పూజకు సంకల్పం కూడా ఎవరూ చెప్పకూడదు. సంకల్పం వల్ల సూర్య చంద్రాదుల సాక్షిగా కోరికలు వెలిబుచ్చటమవుతుంది. జన్మ రాహిత్యానికి ఈ సంకల్పము ప్రతిబంధకమని ఇక్కడ నమ్మకం. దేవునికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మాత్రం ఆశ్రమంలో వండిన పదార్ధాలే పెట్టాలి. శుచి, శుభ్రత కోసం. పాలు, పళ్ళు, కొబ్బరికాయలు, ఎవరి ఇష్టం వారిది. అయితే వాటిని వినియోగించే బాధ్యత కూడా వారిదే. ఈ దేవాలయం చేరుకోవటానికి కొంచెం దూరం కొండమీదకి ఎక్కాలి. ఇక్కడ మాకిచ్చిన సమయం అర్ధగంట. ఇక్కడనుంచి మధ్యాహ్నం 2-45 కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టి సాయంత్రం 6-10కి పట్టిసం, అక్కడనుండి బస్సులో రాత్రి 8-00 గం. లకు లాంచీల రేవు చేరుకున్నాము.


శ్రీ కొవ్వలిగారు మారుతీ ట్రావెల్స్ వాళ్ళ ఫాను నెంబరు అడిగారు. అందరికీ పనికి వస్తాయని పూర్తి వివరాలు క్రింద ఇస్తున్నాను.
ఇది ఆంధ్ర భూమిలో ప్రచురించబడిందికదా. ఒక పాఠకుడు వ్రాశారు. వాళ్ళు వేరే ట్రావెల్స్ లో బుక్ చేసుకున్నారుట. టికెట్ డబ్బు ఎక్కువ తీసుకున్నారని సంబంధించిన వాళ్ళందరికీ ఆంధ్రభూమి వ్యాసం కాపీ పంపించి రిప్రజెంటు చేశారు. తర్వాత సంగతి తెలియదు. ఆయన రిప్రజెంటు చేసినట్లు వ్రాసిన ఉత్తరం మాత్రం తరువాత వారం ప్రచురించబడింది. మేము వెళ్ళింది 15-11-2008న.
Maruthi Mini Tours & Travels
(Franchise A.P. Tourism & Ministry of Indian Tourism,
Godavari Bund Road, Beside Shankara Mattam
Near BPCL Petrol Bunk, Rajahmundry, E.G. Dist, Andhra Pradesh.
for River & Road Packages
Phone 0883-2424577 (O)
2460749 (O)
Cekk 98661 46177, 94401 79377
For rent a cab service
phone 0883-2473118
Cell 98661 47177, 98661 49177










Saturday, February 7, 2009

ద్రాక్షారామం, తూర్పు గోదావరి జిల్లా

ద్రాక్షారామం -- ఆలయ గోపురం

ఆలయం లోపలి దృశ్యం



ప్రాంగణంలో ఆలయ నమూనా


ద్రాక్షారామం

మనం పుట్టి పెరిగిన వూళ్ళు, మనకు తెలిసిన ప్రదేశాలు ఎన్నో పురాణ గాధలకు, చారిత్రిక విశేషాలకూ నిలయమంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది..ఎంతో ధ్రిల్లింగ్ గా కూడావుంటుంది కదా. మీలో చాలా మంది ద్రాక్షారామం పేరు వినే వుంటారు. అదేనండీ. తూర్పు గోదావరి జిల్లాలో వున్న పుణ్య క్షేత్రం. పంచారామాల్లో ఒకటి. ఈ ప్రదేశంతో ముడిపడి వున్న పౌరాణిక గాధలు మీకు తెలుసా తెలుసు. దక్షుడు, యజ్ఞం బ్లా బ్లా బ్లా ఏదో వుంది. అదే కదా. పూర్తి వివరాలు చెప్పటానికి మీకే ఛాన్సు ఇస్తున్నాము. మీరే చెప్పెయ్యండి అంటారా. సరే నేనే చెప్తాను.

పురాణ కధలు
తారకాసురుని మెడలోని శివ లింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఐదు చోట్ల పడ్డ ఆ లింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారని చెప్పుకున్నాము కదా. అందులో ఒక ముక్క ఇక్కడ పడింది. ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం.

పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే దాక్షారామం అయింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి, అందుకని ద్రాక్షారామం అన్నారు. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కానీ, తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. కారణం అంతకు ముందెప్పుడో ఈయనగారిని చూసి ఆయన పలకరించలేదనీ, అభివాదం చేయలేదని కోపం వచ్చి. ఈ అలకలూ, కోపాలూ ఈ కాలంలోనే అనుకున్నాము, ఆ కాలంలోనూ వున్నాయా అనకండి. ఏ కాలమైనా గుణాలు తమ సహజత్వాన్ని కోల్పోవుకదండీ. అందుకని వాదోపవాదాలకు దిగకుండా ముందుకు సాగుదాం.

ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసింది. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆసంబరం, ఆ హడావిడి తను మిస్ అయిపోతోందే అనుకుంది. శివుడి దగ్గర పుట్టింటికెళ్ళే ప్రపోజల్ పెట్టింది. కానీ శివుడు జగదీశ్వరుడు కదా. ఆయన పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, వద్దు అని నీతి చంద్రిక తిరగేశాడు. కానీ ఆడవారు ఏదైనా తలచుకుంటే, అందులోనూ, పుట్టింటి విషయంలో దాన్ని సాధించకుడా వుండరుగా. మొత్తానికి పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఏమయింది. ఎవరూ ఆవిడని పలకరించలేదు. ప్రేమాదరాలు చూపించలేదు. దానితో పార్వతీదేవికి కోపం వచ్చింది. భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాప పడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పలేక పోయింది. పాపం. ఆ అవమానం భరించలేక తనని తను కాల్చుకుని బూడిద అయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.

పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి సూక్ష్మ శరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు. శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు. ఆ శరీరం 18 ముక్కలయి 18 చోట్ల పడ్డాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలు. వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీ చక్రాలను కూడా స్ధాపించారు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.

ఇంకొక్క కధ మాత్రమే చెప్తానండీ ఈ క్షేత్రం గురించి. పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు. ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడుట. దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట. అప్పుడ అన్నపూర్ణాదేవి ఆయనకీ, శిష్యులకీ భిక్ష పెట్టిందట. వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోవం తెప్పించింది. వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని సేవించమనీ, అక్కడ వుంటే కాశీలో వున్నట్లే వుంటుందనీ చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు. దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంబంమీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది.

వింధ్య పర్వతం గర్వమణిచే కార్యక్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడకొచ్చి కొంతకాలం ఇక్కడ నివసించాడు.

వివరణ చాలా పెద్దగా వుందా. మరి అన్ని విశేషాలు వున్నాయండీ. ఇంకా పైన చెప్పని విశేషాలు బోలెడున్నాయి. క్లుప్తంగా......

· మన దేశంలో దాక్షారామం, శ్రీ శైలం, శ్రీ కాళహస్తి మధ్య వున్న ప్రదేశాన్ని త్రిలింగ దేశమన్నారు. త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా దాక్షారామం ప్రసిధ్ధికెక్కింది.

· ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు. ఇవి అంతర్వాహినులు.

· వేదవ్యాసుడు, అగస్త్య మహర్షి ఒకే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారు.

· ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ. అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠమిది.

· ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు.

· గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు.

· ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట.

· ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో.

· ఇంకా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి, రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి, కైలాస గణపతి దర్శనీయ దేవతా మూర్తులు.

· ఏక శిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.

· అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట.

· 9—10 శతాబ్దాలలో నిర్మింపబడిన ఈ ఆలయ కుడ్యాలపై 832 శాసనాలు చెక్కబడివున్నాయి. మనకి వీటిలోని వ్రాత అర్ధంకాకపోయినా చారిత్రిక పరిశోధకులకు ఇవి పెన్నిధి వంటివి. ఇలాంటి శాసనాల ఆధారంగా చేసిన పరిశోధనల ద్వారానే మనకు మనదేశ పూర్వ చరిత్ర తెలుస్తుంది.

· ఆలయాభివృధ్ధికి ఏ ఏ రాజులు ఎలా తోడ్పడ్డారు, ఏ మండపాలు, ప్రాకారాలు ఎవరు కట్టించారు, ఆలయ నిర్వహణకి ఏ రాజులు ఎంత దానాలిచ్చారు వగైరా వివరాలన్నీ ఈ శాసనాలలో లభ్యమవుతుంది.

· వాడ్రేవు జమీందారులిచ్చిన 125 ఎకరాల భూమిమీద ఆదాయం నేటికీ ఆలయాభివృధ్ధికి తోడ్పడుతోంది.

· భీష్మ ఏకాదశినాడు భీమేశ్వరస్వామి, లక్ష్మీ నారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామిల కళ్యాణం ఒకే వేదికపై జరపడం కూడా ఇక్కడి విశేషమే.


ఇన్ని విశేషాలున్న ఆలయాన్ని మరి మీరూ దర్శిస్తారుగా. దర్శన వేళలు గుర్తు పెట్టుకోండేం.

ఉదయం 6-00 గం. లనుండి 12-00 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3-00 గం. లనుండి 8-00 గం. ల వరకు.


వుండటానికి దేవస్ధానంవారి వసతి గృహాలు, ఉచితంవి, డబ్బు చెల్లించేవి వున్నాయి. దేవస్ధానం వారు మధ్యాహ్నం 12 గం.లకు ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

ఈ ప్రదేశం చేరటానికి కాకినాడ దాకా వెళ్ళి అక్కడనుంచి ఉదయం 9-30 కి. పాసెంజరులో వెళ్ళవచ్చు. గోదావరి జిల్లాలో ముఖ్య పట్టణాలన్నింటినుంచీ బస్సు సౌకర్యం బాగా వుంది. బస్సు స్టాండు గుడికి 1/2 కి.మీ. దూరంలో వుంది.


ఇక్కడితో పంచారామాల కధలు పూర్తయ్యాయండీ.