Thursday, October 29, 2009

శ్రీ సాయి ఆలయం, నిజామాబాద్





శ్రీసాయి ఆలయం

హైదరాబాదు నిజామాబాదు రోడ్డులో నిజామాబాదు మొదట్లోనే వున్న ఈ ఆలయంలో సాయినాధుడు భక్తులకు కొంగు బంగారమై వెలిశాడు. ఈ ఆలయం నూతనంగా నిర్మింపబడింది. దిన దిన ప్రవర్ధమానమవుతున్న ఈ ఆలయంలోని ద్వారకామాయిలో సాయి విగ్రహం భక్తులను ఎంతో ఆత్మీయంగా పలకరిస్తున్నట్లుంటుంది.


Monday, October 26, 2009

శ్రీ లలితా పరమేశ్వరి ఆలయం, న్యాల్కల్












లలితా పరమేశ్వరి ఆశ్రమం, నిజామాబాదు

మన రాష్ట్రంలో వున్న అతి కొద్ది లలితాదేవి ఆలయాల్లో ఇది ఒకటి. అతి సుందరమైన ఈ ఆలయం న్యాల్ కల్ రోడ్డులో ప్రశాంత వాతావరణంలో సందర్శకులను సమ్మోహితుల్ని చేస్తుంది.

ఈ ఆలయ శంఖుస్ధాపన 9-2-2000 న జరిగింది. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన 20-6-2003న జరిగింది.

ఆలయ ద్వారంలోనే 21 అడుగుల వినాయక విగ్రహం ఆలయంలోకి అడుగు పెడుతూనే వీక్షకులను భక్తి భావంతో కట్టి పడేస్తుంది. మెట్లు ఎక్కి పైకి వెళ్తే విశాలమైన హాలులో శ్రీ మాత, శ్రీ లలితా దేవి గర్భాలయం దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి పాదాలను తలపై పెట్టుకుని రోజుకు తొమ్మిది చొప్పున తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటారు.

ప్రక్కనే వున్న శివాలయంలో పంచముఖ శివుని పానువట్టంమీద ద్వాదశ జ్యోతిర్లింగాలు 3-7-2007 న ప్రతిష్టింపబడ్డాయి.








Sunday, October 25, 2009

శ్రీ నీలకంఠేశ్వరాలయం, నిజామాబాదు




నీలకంఠేశ్వరాలయం, నిజామాబాదు

చిన్నదే అయినా అతి పురాతనమైనది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో కాకతీయులు పునరుధ్ధరించారు. అంటే అంతకుముందు ఎప్పటి నిర్మాణమో ఈ ఆలయం. ఈ ఆలయంలోకి అడుగు పెడుతూనే మనసు భక్తి భావంతో నిండి పోతుంది. ఇంత పురాతనమైన ఈ ఆలయం దర్శనీయం.


Saturday, October 24, 2009

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, జానకంపేట

అష్టముఖ కోనేరు
దూరంనుంచి ఆలయ దృశ్యం
అష్టముఖ కోనేరు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, జానకంపేట

సారంగపూరుదాటాక వస్తుంది జానకంపేట. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అష్ట ముఖ కోనేరు ప్రసిధ్ధి చెందింది. ఈ కోనేరును కాకతీయులు నిర్మించారు. ఈ కోనేరులో ఒక్కొక్క కోణానికి ఓం శ్రీమన్నారాయణ అనే అక్షరాలు వ్రాసి వున్నాయి. ఇలాంటి విశిష్టమైన కోనేరు ఇంకెక్కడా లేదుట.

ఇంకొక విశేషం. స్వామి ముందు పెద్ద వర్తులాకారంగావున్న ప్రదేశం వున్నది. ఈ ప్రదేశంలో ఏమైనా తల్చుకుని ఒక నాణేన్ని నిలబెట్టాలిట. ఆ నాణెం నిలబడితే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడివారి నమ్మకం.











Friday, October 16, 2009

హనుమాన్ దేవాలయం, సారంగావూర్







హనుమాన్ దేవాలయం, సారంగపూర్

నిజామాబాదుకి 5 కి.మీ. ల దూరంలో చిన్న కొండమీద వున్న గుడి ఇది. గుడి చిన్నదయినా ఆవరణ విశాలమైనది. చాలా ఆకర్షణీయంగా వుంటుంది. గుడి మొత్తం, ముందు ధ్వజ స్తంబంతోసహా సింధూర వర్ణంతో కనులవిందు చేస్తుంది. ఖిల్లా రఘునాధాలయంలాగానే ఈ ఆలయానికీ, ఛత్రపతి శివాజీకీ సంబంధముంది. ఛత్రపతి శివాజీ గురువుగారైన శ్రీ సమర్ధ రామదాసు ఈ ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం ఆకారాన్ని స్వయంగా గీసి, ఆ రూపురేఖల ప్రకారం విగ్రహాన్ని చేయించి ఇక్కడ స్ధాపించారుట. చుట్టూ మఠాధిపతుల సమాధులు వున్నాయి.

కొండకింద పార్కు అభివృధ్ధి చేశారు. దైవ దర్శనంతోబాటు సరదాగా కొంత సమయం గడపవచ్చు.







Tuesday, October 13, 2009

ఖిల్లా రఘునాధాలయం, ఇందూరు

కొండపైన కోటలోన ఆలయ దృశ్యం
శ్రీ దాశరధి రంగాచార్యని బంధించిన ప్రదేశం

ఆంజనేయస్వామి ఆలయ ద్వారాలు


ఖిల్లా రఘునాధాలయం, ఇందూరు

ఈ ఆలయం నిజామాబాదు శివారులో కొండపైన కోటలో వున్నది కొండపైకి కారు వెళ్తుంది. రాష్ట్రకూట రాజవంశంలో ప్రసిధ్ధి చెందిన ఇంద్రుడు అనే రాజు క్రీ.శ. 914-928 మధ్య ఈ కోటని నిర్మించాడు. ఛత్రపతి శివాజీ గురువైన శ్రీ సమర్ధ రామదాస్ జీ ఈ ఆలయాన్ని నిర్మింప చేశారు. అతి పురాతనమైన ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది. దీని ప్రక్కనే బొడ్డెమ్మ చెరువు.




రఘునాధుడనే మహర్షి ఈ ఖిల్లాలోవున్న సొరంగ మార్గం ద్వారా బొడ్డెమ్మ చెరువు లో వున్న శిలా కట్టడందాకా వెళ్ళి స్నానం చేసి వచ్చేవారని పలు కధనాలు. కోటలో వున్న ఈ మహర్షి ధ్యాన మందిరం కట్టడంలోనే విశిష్టమైన వెంటిలేషన్ సౌకర్యంతో చల్లగా వుంటుంది. ఇక్కడనుంచి డిచ్ పల్లి, సారంగపూర్ కి కూడా సొరంగాలు వున్నాయట.

ఇక్కడ శ్రీ రఘునాధ ఆలయంలో కూర్మ పీఠముపై ప్రతిష్టింపబడ్డ సీతారామస్వామి విగ్రహాలు భద్రాచలంలో విగ్రహాలను పోలి వుంటాయి. 2002 సం. దాకా ఈ గుడి మూసి వుండేదట. ఏడాదికొకసారి మాత్రమే తీసి స్వామి కళ్యాణం జరిపించేవారుట. 2002 సం. నుంచి చిన్న జియ్యరు స్వామి నిత్య పూజలు పునఃప్రారంభించారు,

తెలంగాణా స్వాతంత్ర్య పోరాటంలో శ్రీ దాశరధి రంగాచార్యగారు బంధింపబడిన జైలుని ఈ రామాలయం ముందు చూడవచ్చు.

ఈ కోటలోకి వెళ్ళే మార్గంలో ఆంజనేయస్వామి ఆలయంవుంది. ఈ ఆలయంముందు పెద్ద బండరాళ్ళు కోట గోడల్లా నిలిచి వుండి దర్శకులకు దుర్భేద్యమయిన కోటలోకి ప్రవేశిస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.








Monday, October 12, 2009

యాత్ర కొనసాగుతోంది

అవునండీ, యాత్ర కొనసాగుతోంది. ఇది చెప్పటానికి ఇంత ఆలస్యమయిన కారణం కేవలం నా అనారోగ్యమే. 

సెప్టెంబరు నెలాఖరు లోపల యాత్ర కొనసాగించాలా వద్దా అనే పోస్టు చూసిన నా శ్రేయోభిలాషులు 600 మంది పైనే అనే విషయమే నా బ్లాగుకి విలువనిచ్చింది. 10-10-2009 ఈనాడులోవచ్చిన మహిళా బ్లాగుల అభివృధ్ధి వ్యాసంలో నా బ్లాగు గురించి కూడా చెప్పబడింది. ఆ వ్యాసం ద్వారా నా బ్లాగుకి విచ్చేసిన యాత్రీకులు 700 పైనే. కొత్త ప్రదేశాలను గురించి తెలుసుకోవటానికి వచ్చే ఇంతమందిని నిరాశపరచటం ఇష్టంలేకపోయింది. అందుకే వ్యక్తిగత కోపతాపాలు పక్కన పెట్టి, ఆ భగవంతుడు శక్తి ఇచ్చినంతమటుకూ తిరిగి నా బ్లాగు ద్వారా మిమ్మల్ని యాత్రలకి తీసుకెళ్ళాలని నిశ్చయించుకున్నాను.  

ఎందరో శ్రేయోభిలాషులు ఈ పని ఇదివరకే చెయ్యమని నా బ్లాగులో, మైల్ లో కామెంట్ల ద్వారా ప్రోత్సహించారు. అందరికీ ధన్యవాదాలు. ఏ బ్లాగరయినా, ఏ కారణం వల్లనయినా కొంచెం వెనుకడుగు వేసేటప్పుడు ఇలాంటి ధైర్యం వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. అందుకే విడప్పుడు కామెంటు చేసినా చెయ్యకపోయినా ఇలాంటి సమయాల్లోమాత్రం తప్పనిసరిగా మీ విలువైన అభిప్రాయాలను తెలియచెయ్యండి.

బ్లాగులో టెక్నికల్ గడబిడలవల్ల ఫాలోయర్స్ అందరికీ కోపం వచ్చి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ కొందరు కొత్తగా వచ్చారు. వారి ప్రోత్సాహానికి శతకోటి వందనాలు.