Thursday, December 10, 2009

చిదంబర రహస్యం--3



చిదంబంరంలో ఇతర దర్శనీయ స్ధలాలు

తిల్లయ్ కాళి ఆలయం
 ఈ ఆలయానికి సంబంధించిన ఒక కధ.. ఒకసారి శివునికీ, శక్తికీ మధ్య నాట్య పోటీ జరిగింది.  దానిలో ఓడిన శక్తిని తిల్లయ్ సరిహద్దులలో వుండవద్దని స్వామి శాసించారు.  అందుకే ఆలయానికి ఉత్తరంగా ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈవిడ ఆలయం వుంటుంది.  ఇక్కడ శక్తి ఉగ్రరూపంలోను, శాంత రూపంలోను ఒకే ప్రాంగణంలో రెండు వేరు వేరు ఆలయాల్లో కొలువై వుంది.  ఉగ్ర రూపం విగ్రహం మొత్తం కుంకుమతో అలది కళ్ళు కాటుకతో తీర్చిదిద్దారు.



పాశుపతేశ్వర ఆలయం
కాళీ ఆలయం నుంచి అన్నామలైనగర్ లో వున్న ఈ ఆలయానికి ఆటోలో 25 నిముషాల ప్రయాణం.  నటరాజ ఆలయంనుంచీ ఈ రెండు ఆలయాలనూ చూసిరావటానికి ఆటోకి 140 రూ. తీసుకున్నాడు.  శివుడు అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన ప్రదేశం.  ఇక్కడ శివుణ్ణి వేటగాని రూపంలో ప్రతిష్టించారు.  అమ్మవారు నల్లనాయకి.


అన్నామలై యూనివర్సిటీ
ప్రసిధ్ధి పొందిన అన్నామలై యూనివర్సిటీ భవనాలను పాశుపతేశ్వరాలయానికి వెళ్ళే త్రోవలో చూడవచ్చు.


పిచ్చవరం
చిదంబరానికి 15 కి.మీ. ల దూరంలో వున్న పిక్నిక్ స్పాట్ ఇది.  ఇక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదించాలంటే సముద్రం బ్యాక్ వాటర్స్ లో  వున్న బారులు తీరిన తిల్లయ్ వృక్షాల  మధ్యనుంచి బోటు షికారు తప్పనిసరి.  ఈ వృక్షాల వల్లనే ఈ మధ్య వచ్చిన సునామీని ఈ ప్రాంతం తట్టుకుందట.  లేకపోతే నామరూపాలు లేకుండా పోయేదిట.  వీటికి ఇంకో పేరు అండిలయ్ సుర పొన్నయ్.  బొటానికల్ పేరు రెజోఫరా ఎపిక్యులేటా.  ఇద్దరికి ప్రత్యేక బోటు గంటకి 90 రూ. లు.  మనుషులు,  సమయం, సీజన్ బట్టి రేట్లు మారుతాయి.  ఇక్కడికి కూడా ఆటోలో వెళ్ళిరావచ్చు (250 రూ.)  బస్సుస్టాండునుంచీ గంటకోబస్సు కూడా వుంది.  నటరాజ ఆలయంముందునుంచి వెళ్ళే ప్రతి బస్సూ  బస్ స్టాండుకి వెళ్తుంది.




ఇవ్వండీ చిదంబర క్షేత్ర వివరాలు.  ఒక రోజు అక్కడ వుండేటట్లు వెళ్తే అన్నీ చూడచ్చు.

Wednesday, December 9, 2009

చిదంబర రహస్యం--2






చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా వుందా  అయితే చదవండి.

గర్భ గుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం వుంది. దానికి తెర వేసి వుంటుంది.  ఇక్కడ గోడలో ఒక విశిష్ట యంత్రం బిగించబడి వుందని చెప్తారు.  అది ఏ యంత్రమో ఎవరికీ తెలియదు.  దాని పైన ఎప్పుడూ దట్టమైన చందనం పూసి వుంటుంది.  దానిని ఎవరూ తాకరాదు.  ప్రధాన అర్చకుడు మాత్రం రాత్రి వేళ తలుపులు వేసి ఆ యంత్రానికి పూజ చేస్తారు.  ఇంకెవరికీ పూజ చెయ్యటానికేకాదు  పూజా సమయంలో చూడటానికి  కూడా అనుమతి లేదు.  అయితే ఆసక్తిగల భక్తులు అక్కడి వూజారిని అడిగి రూ. 50 టికెటు తీసుకుంటే కిటికీగుండా కొద్ది దూరంనుంచి  ఆ యంత్ర దర్శనానికి అవకాశం వుంటుంది..  ఆ సమయంలో ద్వారానికి వున్న తెర తొలగించి హారతి వెలుగులో కొద్ది క్షణాలు మాత్రం ఆ యంత్ర దర్శనానికి అవకాశం కల్పిస్తారు.  ఆ యంత్రంపై బంగారు బిల్వ పత్రాల మాలలు కనబడుతాయి.. ఆ కొద్ది క్షణాల దర్శనంలో ఎవరి అనుభూతులు వారివి.. ఎవరి భక్తి పారవశ్యం వారిది.  ఇంతకీ ఆ స్ధలంలో ఏమి వున్నట్లు?   చూసిన భక్తులకు ఏమి కనిపించినట్లు?   ఎవరికీ అంతుబట్టని రహస్యం.  ఇదే చిదంబర రహస్యం.  అయితే విజ్ఞులుమాత్రం ఈ రహస్యం నిరాకారుడైన దేవ దేవుని ఉనికిని సూచిస్తుందనీ, చిత్ + అంబరం అంటే జ్ఞానాకాశాన్ని, అనంతాన్ని వెల్లడిస్తుందని, ఎవరి అంతరంగ భావాలననుసరించి వారికి ఆ రూపంలో నిరాకారుడైన స్వామి దర్శనమిస్తారని తెలుయజేస్తుందని చెబుతారు.


హమ్మయ్య!  రహస్యం తెలిసిపోయిందికదా.  రేపు చిదంబరంలోనూ, చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాల గురించి తెలుసుకుందాము.



ఆలయ గోపురం మీద శిల్ప సౌందర్యం





Tuesday, December 8, 2009

చిదంబర రహస్యం--1

                           చిదంబర రహస్యం             
                                                             

  తమిళనాడు శివాలయాలకి పుట్టిల్లు అంటే అతిశయోక్తి కాదేమో.  అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు ఇంకెక్కడా కనబడవు.  దీనికి ముఖ్య కారకులు తమిళనాడు పాలకులైన చోళ, పాండ్య చక్రవర్తులు అభినందనీయులు.  ముఖ్యంగా చోళులు.  శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ దేవాలయాలకోసం వారు ఖర్చుపెట్టిన డబ్బు అపారం,  వెలకట్ట లేనిది.   ఇన్ని తరాల తర్వాత కూడా మనమీ విశాలమైన దేవాలయాలను ఇంత భక్తి శ్రధ్ధలతో దర్శించి పులకితులమవుతున్నామంటే, ఆ శిల్ప సౌందర్యానికి ముగ్ధలమవుతున్నామంటే, వీటిద్వారా చరిత్ర పుటలను తిరగేస్తున్నామంటే వారు ఖర్చుపెట్టిన ప్రతి దమ్మిడీ వెలకట్టలేనిదేకదా.

  ఇన్ని వేల ఏళ్ళనుంచీ శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న ఆ ఆలయాల దర్శనం మన పూర్వ జన్మ సుకృతం.  అవకాశంవున్నవారు తప్పనిసరిగా దర్శించాల్సిన కోవెలలివి.  అలాంటి ఎన్నో కోవెలలో ఇప్పుడ నటరాజస్వామి వేంచేసిన, పంచ భూత శివ క్షేత్రాలలో ఆకాశ క్షేత్రంగా పేరు పొందిన  చిదంబరం గురించి తెలుసుకుందాము.

  నటరాజస్వామి ఆనంద తాండవం చేసే ఈ ప్రదేశానికి కోయిల్, తిల్లయ్ వగైరా రకరకాల పేర్లు.  ఇదివరకు ఈ ప్రదేశంలో తిల్లయ్ వృక్షాలు ఎక్కువగా వుండేవట.  అందుకని ఆ పేరు.  ఇక్కడ ప్రణవ మంత్రమైన ఓంకారానుగుణంగా నటరాజ స్వామి నర్తిస్తారు.  పంచాక్షరీ సారమైన తన నృత్యం ద్వారా నటరాజ స్వామి సృష్టి, స్ధితి, లయ, సమ్మోహనం, ముక్తి అనే ఐదు క్రియలను ఉద్దీపనం చేస్తారు.


  ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు ఉన్నతమైన గోపురాలు  పైన 13 పెద్ద రాగి కలశాలతో  విశాలమైన వాకిళ్ళతో, అపురూపమైన శిల్ప సంపదతో అలరారుతూ  వుంటాయి. 

  ఈ దేవాలయంలో ఐదుసభలున్నాయి -  చిత్రాబంళం, పొన్నాంబళం, పెరంబళం, నృత్తసభ, రాజ సభ.   చిత్రాంబళంలో నటరాజస్వామి కొలువై వున్నాడు.   చిత్రాంబళానికి ముందు వున్నది పొన్నాంబళం.  ఇక్కడ రోజుకి ఆరుసార్లు స్ఫటిక లింగానికి అభిషేకం చేస్తారు.  పెరాంబళం అంటే దేవ సభ.  ఇక్కడ ఉత్సవ విగ్రహాలు  వుంటాయి.   నృత్యసభలో స్వామి అపురూపమైన ఊర్ధ్వతాండవ నృత్యం చేశారు.  ఇక్కడ స్వామి నృత్య భంగిమ విగ్రహం ప్రతిష్టించబడింది.  రాజ సభ వెయ్యి స్తంబాలతో అలరారుతున్న సుందరమైన మండపం. ఇక్కడే ఆదిశేషుని అవతారమైన పతంజలి ఋషి తన శిష్యులకు వ్యాకరణ సూత్రాలను బోధించారు. ఆణి, మార్గళి మాసాలలో పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో తొమ్మిదవ రోజు స్వామిని ఇతర దేవతలను ఐదు రధాలలో ఊరేగించిన తర్వాత ఇక్కడ విశ్రమింప చేస్తారు.  మర్నాడు పూజాదికాల తర్వాత మధ్యాహ్నం స్వామిని, అమ్మవారిని నాట్యరీతిలో చిత్రాంబళానికి తీసుకు వెళ్తారు.  ఈ వైభవాన్ని చూసితీరవలసినదేగానీ మాటలలో చెప్పనలవికాదంటారు చూసిన భక్తులు.

  ఇక్కడ అమ్మవారు శివ కామ సుందరీదేవి.  వెలుపలి ప్రాకారంలో ఈవిడకి ప్రత్యేక ఆలయం వున్నది.  ఇక్కడే చిత్రగుప్తుని మందిరమున్నది.  ఈ ఆలయంలోని శిల్పకళ, చిత్రకళ బహు సుందరం.

  నటరాజ ఆలయంలో తప్పక చూడవలసిన స్వామి మూలాట్టనేశ్వరార్. ఈయన స్వయంభూ.  ఈ స్వామికి ఈ పేరు రావటానికి కారణం అర్ధరాత్రి పూజ తర్వాత ఇతర శివ క్షేత్రాలలో గల స్వామి శక్తి యావత్తు ఇక్కడి లింగంలోకి వచ్చి లీనం కావడమేనని చెబుతారు.  ఇక్కడ అమ్మవారు ఉమాదేవి.  8 అడుగుల ఎత్తు వున్న ముక్కురుని వినాయకర్, ఏడు చేతులతో నాట్య భంగిమలో వున్న కర్పగ వినాయకుడేకాకుండా, ఇంకా అనేక దేవీ దేవతామూర్తుల ఉపాలయాలు, విగ్రహాలు చూడదగ్గవి.

ఆలయ విశేషాలు
  నటరాజ స్వామి  ఎదురుగా నిలబడి ఎడమ వైపు తలతిప్పితే వరదరాజ స్వామి కనబడతాడు.  ఒకేచోట నుంచుని శివ కేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ ఆలయంలో మాత్రమే వున్నదేమో. 

రవాణా సౌకర్యాలు

  ఈ ఆలయం చేరుకోవటానికి రవాణా సౌకర్యాలు బాగున్నాయి.  చెన్నై, తిరుచిరాపల్లి మెయిన్ రైల్వే లైనులో చిదంబరం స్టేషనులో రైలు దిగితే ఒక కిలో మీటరు దూరంలో ఆలయం వుంది.  తమిళనాడు రాష్ర్టంలోని వివిధ ప్రదేశాలనుంచి బస్సు సౌకర్యం కూడా వుంది.


ఇతర సౌకర్యాలు

   వసతికి  ఆలయ సమీపంలోనే హోటళ్ళున్నాయి. అద్దె రూ. 300 నుంచీ పైన.  చాలాహోటల్స్ లో రూమ్ సర్వీసు వుండదు.  భోజనానికి ఆలయ సమీపంలోనే  కుమరన్ భవన్ (మధ్యాహ్నం 12-30 నుంచీ 3 గం. ల దాకా మాత్రమే భోజనం దొరుకుతుంది మిగతా సమయాలలో టిఫెన్లు మాత్రమే వుంటాయి),  హోటల్ శ్రీ కృష్ణా వున్నాయి (ఇక్కడ మధ్యాహ్నం కూడా భోజనం వుండదు అయితే రైస్ ఐటమ్స్ లభిస్తాయి). 

  తమిళనాడులో ఏ ఆలయంలోనైనా అర్చన టికెట్ల ధర తక్కువ వుంటుంది గానీ నైవేద్యానికి తప్పనిసరిగా ఫలములుండాలి (కొబ్బరికాయైతే మంచిది.  వేరే ఊరిలో కొబ్బరి ఏంచేసుకోవాలంటారా   ప్రసాదం ఎపరికైనా ఇవ్వచ్చు.  స్వామి దగ్గర మనం తీసుకు వెళ్ళిన కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తారంటే మనకీ సంతోషం కదా).  అది లేకపోతే అర్చన షోడశ నామాలకే పరిమితమవుతుంది.

  సాయంత్రం 6 గం. లకి చాలా ఆలయాలలో అభిషేకం జరుగుతుంది.  ఆ సమయంలో చందనాభిషేకం తర్వాత దైవ ప్రతిమ కళ్ళు, కనుబొమలు, నోరు దగ్గర చందనం తుడుస్తారు.  అప్పుడు దేవుళ్ళ దివ్య సౌందర్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవు అనిపిస్తుంది.

చిదంబర రహస్యం గురించి రేపు చెప్తాను.  సరేనా? 




ఆలయం లోపలి ప్రాకారంలో శిల్ప సౌందర్యం


 రధం మీద శిల్ప సౌందర్యం

ఆలయ గోపురం
 


రధం

Friday, December 4, 2009

తిరువణ్ణామలైలో కార్తీక దీపం


ఆలయం లోపల వెలిగించిన జ్యోతి ఇది. ఇలాంటిదే ఆలయం వెలుపల కూడా వెలిగిస్తారు (కొండమీద కాకుండా)
ఆలయ ప్రధాన ముఖద్వారం (కనబడే గోపురం) షుమారు ఒక కి.మీ. దూరం వుంటుంది.
గిరి ప్రదక్షిణ
కొండమీద కార్తీక దీపం -- ఈ కొండకే ప్రదక్షిణ చేసేది
(దీపం వెలిగించక ముందు గిరి ప్రదక్షిణ)

తిరువన్నామలిలో కార్తీక దీపం

తమిళనాడులో ప్రసిధ్ధికెక్కిన శైవ క్షేత్రం తిరువణ్ణామలై. ఇక్కడ శివుడు పంచ భూతాలలో ఒకటైన అగ్ని లింగం రూపంలో వుంటాడు. పూజ్యులు రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడే వున్నది. తిరువణ్ణామలైలో ప్రతి సంవత్సరం తమిళ కార్తీక మాసంలో జరిగే అతి పవిత్రమైన, ప్రసిధ్ధికెక్కన కార్తీక దీపం చుట్టుప్రక్కల చాలా కిలో మీటర్ల దూరం వరకు కనబడుతుంది. ఈ దీపాన్ని పార్వతీ పరమేశ్వరుల నివాస స్ధలంగా చెప్పబడే కొండ మీద ప్రతి తమిళ కార్తీక పౌర్ణమి నాడు సాయం సంధ్యా సమయంలో వెలిగిస్తారు.

ఇక్కడ ఈ కొండకి చేసే ప్రదక్షిణని గిరి వలం అంటారు. దీనిని చాలా పవిత్రంగా, పుణ్యప్రదంగా భావిస్తారు. 14 కి.మీ. ల దూరం, చెప్పులు కూడా లేకుండా నడుస్తారు ఈ గిరి ప్రదక్షిణ కోసం. ముఖ్యంగా పౌర్ణమి నాడు షుమారు 60 అడుగుల వెడల్పు వున్న ఈ ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణ చేసే జనాన్ని చూస్తే తమిళనాడు మొత్తం అక్కడే వుందా అనిపిస్తుంది. అంత జనం. ఈ పర్వతాన్ని సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల రూపంగా కొంతమందంటే, పార్వతీ పరమేశ్వరులు ఈ శిఖరం మీద వుంటారని కొందరి నమ్మకం.

మా అబ్బాయి, తేజస్వి తిరువణ్ణామలైలోని అరుణై ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి అవటంతో ఆ క్షేత్రంతో కొంత అనుబంధం ముడిపడివుంది. వాడి చదువు కారణంగా మేమూ ఆ క్షేత్ర దర్శనం, గిరి ప్రదక్షిణ చేయగలిగాము. వాడు 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఏడాది దీప దర్శనానికి వెళ్ళాడు. ఈ ఏడాది తమిళ కార్తీక పౌర్ణమి (రాత్రిపూట పౌర్ణమి వున్న రోజు) 1-12-2009 అయింది. ఆ ఫోటోలతో బాటు, దీపం వెలిగిన వీడియో, గిరి ప్రదక్షిణలో జన సందోహం వీడియో కూడా అప్ లోడ్ చెయ్యాలని ఉదయం నుంచి ప్రయత్నించి లాభం లేకపోయింది. ప్రస్తుతానికి ఫోటోలు చూడండి.