Thursday, August 27, 2009

జగ్గయ్యపేటలోని దేవాలయాలు--4

ఆలయం బయట విశాలమైన పురాతన మంటపం
ఇక్కడే గోదా కళ్యాణం వగైరా ఉత్సవాలు జరుగుతాయి
ఆలయంపై కొత్తగా రూపు దిద్దుకుంటున్న విగ్రహాలు



జగ్గయ్యపేటలోని దేవాలయాలు--४



శ్రీ ధనశైల సీతారామస్వామి దేవాలయం


300 సంవత్సరాల క్రితం విజయవాడ దగ్గర ధనమ్మబొడ్డులో తవ్వకాలలో దొరికినయ్యిట ఈ విగ్రహాలు. ఇక్కడ ప్రతిష్టించి గుడి కట్టించారు. అందుకనే ఆ పేరు. ప్రక్కనే సంతాన వేణుగోపాలస్వామిని ప్రతిష్టించారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆండాళ్ళు (గోదాదేవి), ఆళ్వారులు కూడా వున్నారు. ఎదురుగా ఆంజనేయస్వామి.

దేవాలయానికి 70 ఎకరాల భూమి వుందిట. కానీ సరైన పోషణ వున్నట్లు కనిపించలేదు. దేవాలయం చుట్టూ గదులు, బయట పాతకాలపు విశాలమైన మంటపం. అందులో ప్రస్తుతం స్కూలు నడుస్తోంది. గోదా కళ్యాణం వగైరాలన్నీ ఆ మంటపంలోనే చేస్తారుట.

ఈ దేవాలయాలన్నీ ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు అధీనంలో వున్నాయి. దేవాలయానికి మరమ్మత్తులు సాగుతున్నాయి. అందులో భాగంగా దేవాలయం చుట్టూ విగ్రహాలు పెట్టారు. అందులో సాయిబాబా విగ్రహం కూడా వుంది. మేము వెళ్ళేసరికి ఇంకా పని పూర్తి కాలేదు.

ఇవేకాక ఇంకా కన్యకాపరమేశ్వరి గుడి, అయ్యప్ప దేవాలయం, సాయిబాబా దేవాలయం వగైరాలు వున్నాయి.

ఇంత పురాతనమైన ఈ ఆలయాలను చూస్తుంటే మన పూర్వీకులు ఎంతెంత వ్యయ ప్రయాసలకోర్చి తమ కలల రూపాలను భవిష్యత్ తరాలకోసం సాకారంగా నిలిపారో అనిపిస్తుంది. ఇంతలోనే ఇంకో సందేహం. మనం వాటికి సరైన విలువ ఇస్తున్నామా???



Wednesday, August 26, 2009

జగ్గయ్యపేటలోని దేవాలయాలు--3

శ్రీ వరదరాజస్వామి దేవాలయం, జగ్గయ్యపేట
ముందుగా కనబడ్డ నాగరాజు



జగ్గయ్యపేటలోని దేవాలయాలు--३


శ్రీ వరదరాజస్వామి దేవాలయం


పూర్వకాలంలో ఇక్కడ యాదవులు వుండేవారు. వాళ్ళు ఇక్కడ గోవులను కాచుకుంటూ, ఒక రాతిమీద కూర్చుంటుండేవాళ్ళు. ఆ కాలంలో శ్రీ చిలకమర్తి గోపాలాచార్యులు అనే వ్యక్తికి స్వామి కలలో కనబడి, మీ ఇలవేల్పుని నేను, ఇక్కడ వెలిశాను, వెతికి పట్టుకో అన్నారుట. ఆయనా, ఇంకొందరు కలిసి వెతుకుతూ వస్తే ముందుగా నాగరాజు విగ్రహం కనిపించిందట (ఫోటో). తర్వాత శంఖం, చక్రం, తర్వాత రాతిమీద స్వామిని చూశారుట. దాన్ని ప్రతిష్టించి, పూజలు చేశారుట. తర్వాత దానిమీద విగ్రహాలు స్ధాపించారు. గర్భాలయానికి ఒక ప్రక్క మహాలక్ష్మీ అమ్మవారు, ఇంకొక ప్రక్క వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆళ్వారులు కొలువుతీరి వున్నారు।


మేము వెళ్ళేసరికి ఈ గుడీ మూసివుంది. అయితే గుడి ఎదురుగానే పూజారిగారి ఇల్లవటంవల్ల పిలిస్తే వచ్చి తలుపు తీశారు. పూజ శ్రధ్ధగా చేశారు. చాలా సంతోషం అనిపించింది అంత పురాతన ఆలయంలో మా గోత్ర నామాలతో అంత బాగా పూజ జరగటంతో. పూజారిగారే ఆలయ చరిత్ర చెప్పారు. నాగరాజు దగ్గర పుట్టబంగారం ఇచ్చారు।


అంతేకాదు, వీళ్ళ తమ్ముడే ధనశైల సీతారామస్వామి దేవాలయంలో పూజారిగారు. ఆయన ఆ గుడి మూసిరావటంతో ఆయన్ని పంపించి ఆ గుడి తలుపులు తెరిచి మాకు దర్శనానికి వీలు కలిగించారు. రేపు ఆ ఆలయం గురించి...ఈ సీరీస్ లో ఆఖరి పోస్టు।



Tuesday, August 25, 2009

జగ్గయ్యపేటలోని దేవాలయాలు--2

శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం



శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం


ఈ దేవాలయం 400 సంవత్సరాలక్రితం కట్టబడింది. ఆ కాలంలో ఒకరి కలలో స్వామి కనబడి, ముక్త్యాల దగ్గర ఉత్తర వాహిని అయిన కృష్ణానదిలో తానున్నానని, తీసుకువచ్చి గుడికట్టించమని సెలవిచ్చారుట. వారు ఆ లింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ గుడి కట్టించారుట. చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహాలు వగైరా దేవతలకు చిన్న చిన్న గుళ్ళున్నాయి.

మేము వెళ్ళేసరికి గుడిమూసివున్నది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న ఈ ఊరి వ్యక్తి ఒకరు అక్కడ కలిశారు. ఆయన ఈ దేవుడు చాలా పవర్ ఫుల్ దేవుడు..దర్శనం చేసుకోకుండా వెళ్ళద్దు..అని చెప్పారు. ఆయన సలహామీదే గుళ్ళోనే ఒక ప్రక్కగా వున్న పూజారిగారిని పిలుచుకొచ్చారు మా ఆటో రాము.

గుడిలోపల అంతా మరమ్మత్తులు చేయిస్తున్నారు. నేల అంతా పగలగొట్టి దుమ్ము ధూళితో నిండివుంది. అందుకనే శివలింగాన్ని పక్కనే వున్న చిన్న మంటపంలో పెట్టి పూజలు చేస్తున్నారు. ఆలయం 400 సంవత్సరాల క్రితం కట్టబడింది. చుట్టూవున్న ప్రాకారాలు వగైరాలు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు (అమరావతి వగైరా ఆలయాలను పునరుధ్ధరించినవారు) అభివృధ్ధి చేశారు. వీరి వంశీకులే ముక్త్యాల జమీందారులు।


రేపటి పోస్టు శ్రీ వరదరాజస్వామి దేవాలయం, జగ్గయ్యపేట.





జగ్గయ్యపేటలో దేవాలయాలు

శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వెలుపలి ద్వారం



శ్రీ పంచనామాల వెంకటేశ్వరస్వామి ఆలయం వెలుపలి దృశ్యం


జగ్గయ్యపేటలోని ఆలయాలు



జగ్గయ్యపేట ఊళ్ళో ప్రసిధ్దికెక్కిన పురాతన ఆలయాలతోపాటు క్రొత్త ఆలయాలు కూడా చాలా వున్నాయి. అయితే వీటిని చూడాలంటే ఉదయం 9 గం. లలోపే వెళ్ళాలి. తర్వాత గుడి మూసేస్తారు. మధ్యాహ్నం ఒక గంటసేపు నైవేద్యంకోసం తీస్తారు, మళ్ళీ సాయంత్రం 6 గం. లకే తీస్తారు. అయితే చాలా ఆలయాలలో పూజారి ఇల్లు సమీపంలోనే వుంటుందిగనుక కనుక్కుని వెళ్ళి అడిగితే వాళ్ళు వచ్చి ఆలయాన్ని తెరుస్తారు. ఇక్కడ గుళ్ళకి మాన్యాలుకూడా బాగానే వున్నాయంటారుకానీ చాలామటుకు జీర్ణావస్ధలో వున్నాయి. మన దేశానికే ప్రత్యేకమైన ఈ పురాతన ఆలయాలను ఆదరించి, అభివృధ్ధిచేసి తరతరాలూ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనావుంది.

ఉదయం జగ్గయ్యపేటలోని కొన్ని గుళ్ళు చూడాలని బయల్దేరాము. ఊళ్ళో పాత దేవాలయాలు వున్నాయని హోటల్ లో చెప్పారుగానీ అవి ఏమిటో, ఎక్కడ వున్నోయో చెప్పలేకపోయారు. ఇలాంటి విషయాలలో ఆటోవాళ్ళు సరైన సమాచారం ఇస్తారు. ఒక ఆటో అతన్ని అడిగేసరికి ఇద్దరుముగ్గురు పోగయ్యారు. వాళ్ళకి అన్ని గుళ్ళూ తెలియవని ఇంకొకతన్ని పిలిచారు..అతనికి అన్ని గుళ్ళూ తెలుసని. అతని పేరు రాము. ముందే చెప్పాం మాకు ఇక్కడ దోవలు తెలియవు, మధ్యాహ్నందాకా వీలైనన్ని పాత గుళ్ళు చూపించాలని. రాము చాలా మంచివాడు. పంచనామాల వెంకటేశ్వరస్వామి గుడి తప్ప మిగతా గుళ్ళు మూసివుంటే, పూజార్ల ఇళ్ళు కనుక్కుని వెళ్ళి పిలుచుకు వచ్చాడు. ఇద్దరు కొడుకులను చదివిస్తున్నాడుట. మాతోబాటు అన్ని గుళ్ళకీ వచ్చి అర్చకులనడిగి మాకు వివరాలు చెప్పించాడు. అతను చూపించిన నాలుగు దేవాలయాల గురించి వివరిస్తున్నాను. ఇవికాక పాత, కొత్త ఆలయాలు చాలా వున్నాయ

పంచనామాల వెంకటేశ్వరస్వామి ఆలయం

200 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం ఇది. ఇటీవల మరమ్మత్తులు చేయించి ఆలయం చుట్టూ బయటవైపు దేవుళ్ళ టైల్స్ వేయించారు. బాగున్నాయి.

ఇదివరకు ఇక్కడ గోశాల వుండేదిట. ఏసోబు కోటయ్య అనే ఆయనకు శ్రీ వెంకటేశ్వరస్వామి కలలో కనబడి తానక్కడ వెలిశానని చెప్పటంతో విగ్రహాన్ని తవ్వి తీశారుట. శిలకు 5 నామాలు వున్నట్లు ప్రత్యక్షమయ్యారుట స్వామి. (ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహ రూపంలో వుండరు...శిలా రూపంలో వుంటారు). ఆప్పటినుంచీ స్వామిని కేశవనామాలతో అర్చించసాగారు।

శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం

ఇది చాలా పాతది. ఆలయం మూసివున్నది. ద్వారం చాలా పెద్దది. ఆ ద్వారాన్ని చూసి లోపల గుడి చూడలేకపోయామే అనుకున్నాము. ఇక్కడ పూజారి ఉదయం, సాయంత్రం వచ్చి పూజలు చేసి వెళ్ళిపోతారుట. జనం ఎక్కువగా రారట...అందుకనేనేమో.

రేపటి పోస్టు శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం గురించి।