Saturday, November 21, 2009

షిర్డీ యాత్ర


షిర్డి యాత్ర

శ్రీ శైల్ గారు షిర్డీ యాత్ర గురించి చెప్పమన్నారు. అంతకన్నా మహద్భాగ్యం నాకేముంటుంది. శైల్ గారూ, మీరెక్కడ వుంటారో తెలియదుగానీ అనేక ప్రదేశాలనుంచీ ఆర్.టి.సీ వారూ, రైల్వేవారూ, ఇంకా ప్రైవేటు బస్సుల వాళ్ళూ షిర్డీకి టూర్ పాకేజ్ లు ప్రవేశ పెట్టారు. మొదటిసారి షిర్డీ వెళ్ళేవాళ్ళు, కొంచెం సొకర్యంగా వెళ్దామనుకునేవాళ్ళు వీటిని ఉపయోగించుకుంటే, షిర్డీలో దిగగానే ఎక్కడ వుండాలి అనే మొదటి ప్రశ్న రాదు. ఎందుకంటే వసతి వారే చూపిస్తారు. లాడ్జింగులు బాగానే వుంటాయి. చాలామటుకు గుడి పరిసర ప్రదేశాల్లోనే వుంటాయి. లేకపోయినా నడవలేనివారికి ఆటో సౌకర్యం బాగా వుంటుంది.

ఆలయ సమీపంలోనే దేవస్ధానంవారు ఇచ్చే వసతి సౌకర్యంకోసం కూడా దేవస్ధానం ఆఫీసులో సంప్రందించవచ్చు. వారివి వసతికి డార్మెంటరీల దగ్గరనుంచి విడి గదులదాకా వున్నాయి. అవకాశాన్నిబట్టి ఇస్తారు. జనం ఎక్కువగా వున్నప్పుడు ఇవ్వేమీ దొరక్కపోయినా కంగారు పడక్కరలేదు. దేవస్ధానంవారు పరుపులు అద్దెకు ఇస్తారు. విడివారు అవి తీసుకుని ఆరుబయట వేసుకుని పడుకుంటారు. చాలామందిని ఆకర్షించినవి మాత్రం నిస్సందేహంగా వసతి సౌకర్యం, తిరుగు ప్రయాణంతో కూడిన బస్ రిజర్వేషన్లే.

హైదరాబాదు నుంచి సాయంత్రం 5 గం. నుంచి బయల్దేరటం మొదలు ఈ బస్సులు. ఇక్కడనుంచి 14 గం. ల ప్రయాణం. త్రోవలో భోజనాలు, కాఫీ, టీలు, దేనికీ ఇబ్బంది లేదు. తిరుగు ప్రయాణం టిక్కెట్టు కూడా ముందు తీసుకున్నవాళ్ళకి మాత్రమే వసతి సౌకర్యం. కనుక మీరు తిరుగు ప్రయాణం ఎప్పుడో ముందే నిర్ణయించుకోవాలి. మర్నాడే బయల్దేరి రావచ్చు, లేదా మీ ఇష్టం వచ్చినన్ని రోజులు అక్కడ ప్రదేశాలన్నీ చూసి తర్వాత బయల్దేరచ్చు. బస్లో వెళ్తే ఖచ్చితమైన ప్రయాణం తేదీ, బస్ నెంబరూ, సీట్ల నెంబర్లు వేసిన టికెట్ మీరు భద్ర పరచుకోండి, బస్ రాంగానే మీ సీట్లు ఆకుపై చెయ్యండి. టూరిస్టు ప్రదేశాలు కదండీ పొరపాట్లు ఎవరికైనా సహజం.

ఇంక ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు

1. సాయిబాబా సమాధి మందిరం. ఇక్కడే బాబా విగ్రహం కూడా వుంటుంది. ఈ హాల్లోనే ముందువైపు బాబాకి ఉదయం భక్తులు పాల్గొనే ఆభిషేకాదులు నిర్వర్తిస్తారు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

2. ద్వారకామాయి (మసీదు)..ఇక్కడ బాబా మొదటిసారి వెలిగించిన ధుని ఇంకా వెలుగుతూనే వుంది. బాబా ఉపయోగించిన వస్తువులు కొన్ని, ఆయన కూర్చున్న ప్రదేశాలు, అన్నీ బోర్డులు పెట్టి వుంటాయి. చూడండి.

3. చావడి..బాబా కొన్ని రాత్రులు ఇక్కడ నిద్రించేవారు. చెక్కబల్లకి పాత గుడ్డపీలికలు కట్టి ఎత్తుగా వేలాడదీసి దాని మీదకెక్కి నిద్రించినది ఇక్కడే.

4. గురుస్ధాన్. ఇక్కడే నేలలో తవ్వినప్పుడు వెలిగించిన దీపాలు కనబడ్డాయంటారు.

5. లెండీ తోట, మందిర పరిసర ప్రాంతంలోనే బాబా శిష్యుల సమాధి మందిరాలు, శివ, గణేష్, శనీశ్వరుని ఆలయాలు, దత్త మందిరం, పారాయణ హాల్ అన్నీ దర్శనీయ స్ధలాలే.

6. కొద్ది దూరంలో లక్ష్మీబాయి ఇల్లు వుంది. అక్కడ ఆవిడకి బాబా ఇచ్చిన తొమ్మిది వెండి రూపాయి నాణేలు ఒక ఫ్రేమ్ లో బిగించి పెట్టారు వారి కుటుంబీకులు భక్తుల సందర్శానార్ధం.

7. మసీదుకి చావిడికి మధ్యలో ఆంజనేయస్వామి ఆలయం. ఇవి ఆలయ పరిసరప్రాంతంలో చూడదగ్గవి. షాపుల గురించి నేను చెప్పలేదండీ అవ్వెటూ మీరో, మీతో వచ్చినవారో చూస్తారుగదా.

8. పరిసర ప్రాంతాల్లో చూడదగ్గవి అంటే ముఖ్యంగా చెప్పతగ్గది శనిసింగడాపూర్. ఇక్కడ శనీశ్వరుడు ఒక నిలువెత్తు రాయి రూపంలో కొలువబడతాడు. ఆయనకి ఆలయం లేదు. అంటే ఆ రాయి ఆరుబయలే వుంటుంది. శని దోషం వున్నవారు ఇక్కడకి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేసి వస్తారు. దీనికి మగవారిని మాత్రమే అనుమతిస్తారు. వారు కూడా అక్కడ ఇచ్చే ధోవతులు కట్టుకుని, స్నానం చేసి వెళ్ళి అభిషేకం చేసి, మళ్ళీ వచ్చి స్నానం చేస్తారు. స్త్రీలు ఆభిషేకం చెయ్యకూడదు కానీ, చూడవచ్చు. ఇక్కడ ఇళ్ళకి తలుపులూ, తాళాలూ వుండవు. ఆ ఊళ్ళో దొంగతనాలు అస్సలు జరగవు. అంత మహిమగల ప్రాంతంగా చెప్తారు. షిర్డీనుంచి జీపులో వెళ్ళి అదే రోజు తిరిగి రావచ్చు. బహుశా 70, 80 కి.మీ. ల దూరం వుంటుంది.. గుడి దగ్గరే జీపుల వాళ్ళు అరుస్తూ వుంటారు. మనిషికింతని తీసుకుంటారు. ఎంత సమయం పడుతుందో ముందు కనుక్కోండి.

9. తర్వాత సాకురీ అనే చోట ఉపాసినీ బాబా ఆశ్రమం వున్నది. దీనికి వెళ్ళి రావటానికి జట్కా సౌకర్యం కూడా వుంది. మేము వెళ్ళి చాలా రోజులయింది. అందుకే వివరాలు పూర్తిగా ఇవ్వలేక పోతున్నాను. ప్రదేశం తెలిస్తే అన్నిచోట్లకీ వాహన సౌకర్యం వుంటుంది.

10. తర్వాత పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వుంది అన్నారు కానీ మేమింత మటుకు చూడలేదు.

11. నాసిక్, త్రయంబకేశ్వరం (జ్యోతిర్లింగం) కూడా షిర్డీకి దగ్గరే. అయితే దీనికి రెండు రోజులుంటే తీరిగ్గా చూడవచ్చు.

12. అలాగే కొందరు పండరీపూర్, తుల్జాపూర్ కూడా ఈ యాత్రలో కలుపుకుంటారు.

మేము వెళ్ళి మూడేళ్ళపైనే అయింది. షిర్డీ గురించి అడిగారు కదాని నాకు గుర్తున్నంత మటుకూ చెప్పాను. క్షేమంగా వెళ్ళి బాబా ఆశీస్సులతో రండి.


Sunday, November 1, 2009

రామాలయం, డిచ్ పల్లి





జోరు వానలో కారు ప్రయాణం


ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

నిజామాబాదుకు 12 కి.మీ ల దూరంలో ప్రకృతి రామణీయకత మధ్య కొండమీద కొలువైవున్న రామయ్యతండ్రి ఆలయం ఇది. 11వ శతాబ్దంనాటి ఈ ఆలయాన్ని చాళుక్యులు జైనమత ప్రేరణతో కట్టించారు. కొండమీదికి మెట్లు చిన్నగా, ఎక్కటానికి వీలుగా వుంటాయి. పూజాదికాల సమయానంతరం పూజారి వుండకపోవచ్చు. కటకటాల వాకిలిలో నుంచి పగలు ఏ సమయలోనైనా స్వామి దర్శనం చేసుకోవచ్చు.

ఆలయం చిన్నదయినా అద్భతమైన శిల్ప సౌందర్యంతో అలరారుతున్నది. చుట్టూ పచ్చని చెట్లు. పైగా మేము వెళ్ళినప్పుడు వాతావరణం చల్లగా వుండి సన్నగా తుపర పడుతోంది. ఆ వాతావరణంలో ఆ ప్రదేశాన్ని వదిలి రాబుధ్ధి కాలేదు. అందుబాటులోవున్న ఇలాంటి కళాఖండాల విలువ తెలుసుకుని ఆదరించి వాటి వైభవాన్ని నిలపవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాదు...మనందరిదీ కూడా.

ఆలయాలేకాదు, ఆలీ సాగర్, శారదా సాగర్ లాంటి పిక్నిక్ ప్రదేశాలు కూడా వున్నాయి నిజామాబాదులో. మేము 21-3-2008 ఉదయం 7 గం. లకు ఇంట్లో బయల్దేరిన వాళ్ళం ఏడుపాయలు, మెదక్ చర్చ్, బికనూరు, ఇస్సన్నపల్లి, బుగ్గరామేశ్వరం, ఇందూరు, సారంగాపూర్, జానకంపేట, బాసర, నిజామాబాదులో ఆలయాలు, డిచ్ పల్లి ఇన్ని చూసి 23-3-2008 రాత్రి 7 గం. లకి ఇంటికి చేరాం. చాలా చూశాం కదూ. వచ్చేటప్పుడు నిజామాబాదునుంచి హైదరాబాదు ఇంకో పది కిలోమీటర్లు వుంది అనేదాకా చాలా పెద్ద వాన. నాకైతే కొంచెం భయంకూడా వేసింది. వానలో మా కారు ప్రయాణం ఫోటోలు కూడా చూడండి. మరింకేం బయల్దేరండి...నిజామాబాదు దర్శనానికి.