Sunday, March 21, 2010

శ్రీ సిధ్ధి వినాయక ఆలయం, రేజింతల్




జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్ళే దోవలో 10 కిలో మీటర్లు వెళ్ళాక కుడి వైపు కమాన్ వస్తుంది. ఈ కమాన్ ద్వారా సుమారు ఒక కిలో మీటరు దూరం లోపలకి వెళ్తే వస్తుంది ఈ ఆలయం.

పూజారిగారి కధనం ప్రకారం 210 ఏళ్ళ క్రితం ఒక భక్తుడు ఇక్కడ రోజూ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ వుండేవాడు. అప్పుడు వినాయకుడు స్వయంభూగా వెలిశాడు. వినాయకుడు సాక్షాత్కరించేటప్పటికి ఆయన ఆకారం 1.5 అడుగుల ఎత్తు మాత్రమే. ఆ విగ్రహం పెరుగుతూ వుందిట. ప్రస్తుతం 5 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని భక్తులు చూడవచ్చు. స్వామి ఇంకా పెరుగుతూనే వున్నాడుట.

స్వామి సాక్షాత్కరించిన తర్వాత అక్కడ ఆలయం నిర్మింపబడింది. దిన దిన ప్రవర్ధమానమవుతున్న ఈ ఆలయానికి భక్తులు ఆంధ్ర ప్రదేశ్ నుంచేకాక, కర్ణాటక, మహారాష్ట్రలనుంచి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు.

దర్శన సమయాలు

ఉదయం 5 గంటలనుంచి రాత్రి 10 గంటలదాకా.


Monday, March 15, 2010

శ్రీ కేతకీ సంగమేశ్వర క్షేత్రము, ఝరాసంగము




ఈ మధ్య ఈ బ్లాగులో జరిగిన వాద వివాదాలలో యాత్రపట్ల అనేకమంది శ్రేయోభిలాషులు చూపించిన అభిమానానికి పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు. ఇంత అభిమానానికి బదులుగా మీకందరికీ ఇవాళ మన సమీప ప్రాంతంలోవున్న ఒక విశేష తీర్ధ స్ధలం గురించి చెబుతాను.

మన చుట్టుప్రక్కల వున్న ప్రదేశాలగురించి ఏనాడో పురాణాల్లో వ్రాయబడి వున్నదంటే మనకెంత అద్భుతంగా అనిపిస్తుందికదూ. మనకింత సమీపంలోవున్న ఈ ప్రదేశాలు పురాణాలలో ఇంత ప్రాముఖ్యత సంపాదించుకున్నాయంటే, అలాంటి పుణ్య ప్రదేశాలలో పుట్టిన, లేక అలాంటి ప్రదేశాలతో ఏదో ఒక సంబంధం వున్న మనం ఎంత అదృష్టవంతులమోకదా.

మెదక్ జిల్లావాసులుగానీ, హైదరాబాదు చుట్టుప్రక్కలవారుగానీ ఝరాసంగము అనే ప్రదేశము గురించి విన్నారా అనే ప్రశ్న వేస్తే చాలామటుకు సమాధానం లేదనే వస్తుంది. ఒకవేళ విన్నవారు వున్నా, ఈ క్షేత్రంయొక్క పురాణ ప్రాముఖ్యత తెలిసి వుండకపోవచ్చు. మన పొరుగునవున్న ఈ ఊరి గురించి అప్పుడెప్పుడో వ్రాసిన బ్రహ్మాండ పురాణంలో ఐదు అధ్యాయాల్లో చెప్పారట. అయోధ్యలో హరిశ్చంద్ర మహారాజు చేసిన యజ్ఞానికి వచ్చిన సూత మహర్షిని చూసి, ఆ యజ్ఞానికి వచ్చిన మిగతా ఋషులంతా ఏదేని పుణ్య క్షేత్రం గురించి తెలియజెయ్యమని కోరగా, ఈ క్షేత్రం గురించి తెలియజేశారుట సూత మహర్షి. ఇంక ఊరించకుండా అసలు విషయం చెబుతున్నాను.

హైదరాబాదుకి వంద కిలో మీటర్ల దూరంలో జహీరాబాద్ వుంది., అదేనండీ, ముంబాయి, షిర్డీ వెళ్ళే త్రోవలో వున్న జహీరాబాదే. ఈ జహీరాబాద్ లో అడుగు పెడతూనే (హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు) కుడివైపు ఒక కమాను....శ్రీ కేతకీ సంగమేశ్వర క్షేత్రము, ఝరాసంగము అనే వివరణతో కనబడుతుంది. ఈ కమాను కొంచెం క్రాస్ గా వుంటుంది. కనుక జహీరాబాద్ సరిహద్దులో అడుగుపెడుతూనే జాగ్రత్తగా చూడండి. ఈ కమాన్లోంచిలోపలికి 13 కిలో మీటర్లు వెళ్తే వస్తుంది శ్రీ కేతకీ సంగమేశ్వర క్షేత్రం.

పూర్వం సూర్యవంశ రాజైన కుపేంద్ర మహారాజు భయంకరమైన కుష్టు రోగంతో బాధ పడేవాడు. ఏ వైద్యం చేయించినా, ఏ క్షేత్రం తిరిగినా ఆయన రోగం నయం కాలేదు. ఒకసారి వేటకై ఈ ప్రాంతానికి వచ్చి దప్పికతో నీటికోసం వెతికాడు. ఇక్కడ ఒక జలాశయము, దానిలోవున్న బాణ లింగము చూశాడు. నీరు తాగి కొంచెంసేపు విశ్రమించి తన రాజధానికి వెళ్ళాడు. మర్నాడు ఉదయమే ఆయనను చూసిన ఆయన భార్య చంద్రకళ ఆశ్చర్యపోయినది. ఆయన కుష్టురోగం మటుమాయమైనది. దానికి కారణమేమయి వుండనోపని ఆలోచించి తానా గుండములోని నీరు త్రాగుటగురించి, ఆ గుండములోనే వున్న బాణ లింగం గురించి చెప్పాడు. అందరూ కలిసి ఆ క్షేత్రానికి వెళ్ళి, శివుణ్ణి అర్చించారు. ఆ సమయంలో నారద మహర్షి అక్కడే వున్నారు. కుపేంద్ర మహారాజు ఆ ఋషిని ఆ ప్రాంత విశేషాలు వివరించమని ప్రార్ధించగా, నారద మునీంద్రుడు వారికి ఆ క్షేత్ర విశేషాలను ఈ విధంగా వివరించాడు.


పూర్వము ఇక్కడంతా కేతకీ (మొగలి) వనముండేది. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుని కోరికపై భక్తులననుగ్రహించుటకు శివుడు అక్కడ బాణ లింగాకారముతో వెలిశాడు. బ్రహ్మ తన కమండలంలోని జలంతో ఆ లింగాన్ని అభిషేకించాడు. బ్రహ్మ, శివుడు కలసిన ప్రదేశము కనుక ఈ ప్రదేశానికి సంగమం అనే పేరు వచ్చింది. అక్కడ వెలిసిన శివునికి సంగమేశ్వరుడనే పేరు వచ్చింది.

ఇంక స్వామికి కేతకీ సంగమేశ్వరస్వామి అనే పేరు రావటానికికూడా ఒక కధ చెప్పారు.

ఒకసారి బ్రహ్మ, విష్టువులను పరీక్షించదలచి శివుడు లింగ రూపంలో భూమ్యాకాశాలంతా వ్యాపిస్తాడు. శివుని ఆది, అంతము కనుక్కోలేని బ్రహ్మ, విష్ణువు కేతకి అనే అప్పరసతోను (మొగలి పువ్వని కూడా చెప్తారు), గోవుతోను అబధ్ధం ఆడిస్తారు.. శివుని ఆది అంతం తాము చూసినట్లు. దానికి శివునికి కోవం వచ్చి గోముఖానికి పూజ నిషేధిస్తాడు. అలాగే మొగలి పువ్వులు పూజకి పనికిరావని శాపం ఇస్తాడు. అప్పుడా అప్సరస శాప విమోచనానికై ప్రార్ధించగా భూలోకంలో కేతకీ వనంగా పుడతావని, అప్పుడు తానక్కడ వెలసి ఆ పూవుల పూజ అందుకుంటాననీ శివుడు వరం ఇస్తాడు. అందుకే శివునికిక్కడ మొగలి పూవులతో పూజ చేస్తారు. ఇప్పటికీ ఇక్కడ మొగలి చెట్లు ఎక్కువే.

నారదుని మాటలకు సంతసించిన కుపేంద్రుడు తానక్కడే నివసించదలచి సమీపములో కుపేంద్ర నగరమనే అత్యంత సౌందర్యవంతమైన పట్టణాన్ని నిర్మించాడు. ఆ కుపేంద్ర నగరమే ప్రస్తుతం ఈ క్షేత్రానికి ఒక కిలో మీటరు దూరంలో వున్న నేటి కుప్పాపురం అంటారు.

అమృత గుండం

ఈ అమృత గుండం చాలా విశేషమైనది. దీనిలో అనేక తీర్ధములు వున్నాయంటారు. కాశీనుంచి ఒక ఝర ఈ గుండములో కలుస్తుందని పూర్వీకుల కధనం. ఇంకొక ప్రత్యేకత ఇప్పుడుకూడా చూడగలిగినది...మధ్యాహ్న సమయంలో ఈ గుండం ఖాళీ చేసి అందులో వున్న ఋషి తీర్ధమునందు నైవేద్యము పెట్టినచో ఆ నైవేద్యము అక్కడ వున్న దారిలోకి వెళ్ళిపోతుంది. ఎంత నైవేద్యం పెట్టినా, ఎంతమంది నైవేద్యం పెట్టినా అలాగే అవుతుంది. విశేషమేమిటంటే ఆ దోవలోనుంచి నీళ్ళు వ్యతిరేక దిశలో గుండంలోకి వస్తూ వుంటాయి. కొద్ది గంటల్లో గుండం నీటితో నిండిపోతుంది. గుండంలోకి వచ్చే నీటితో పాటు గుండంలోకి రాకుండా ఆ నైవేద్యం అక్కడ వున్న దోవలోకి వెళ్తుంది...ఒకే దారిలోంచి రెండు వ్యతిరేక దిశల్లో, రెండు పదార్ధాలు ఒకేసారి సాగుతాయి. మధ్యలో ఎక్కడా ఏ విధమైన అరలూ లేవట. మేము ఉదయం వెళ్ళాము. అందుకు ఈ విశేషం చూడలేక పోయాము.


శివ లింగానికి వెండి తొడుగు వేసి వుంది. అంటే లింగం వెండి లింగంలాగా వుంటుంది. ఈ తొడుగు చాలాకాలం క్రింతం వెయ్యబడ్డది. లోపల బాణాకార లింగం. తొడుగు వేసిన తర్వాత తియ్యలేదు. ఈ మధ్యకాలం వారిలో తొడుగు లేకుండా లింగాన్ని చూసినవారు లేరు.

శివ లింగం వెనుక పార్వతీ దేవి వున్నది.

సందర్శన సమయాలు
ఉదయం 4 గం.లనుంచి రాత్రి 10 గంటలదాకా.

చిన్నదయినా పురాణ ప్రసిధ్ధికెక్కిన ఈ ఆలయం కార్యనిర్వాహక కమిటీ, గ్రామ ప్రజల ఉత్సాహంతో అనేక కొత్త హంగులు సంతరించుకుంటోంది.




Friday, March 5, 2010

స్వప్న కామెంట్స్




ఇప్పటిదాకా ఆడవారు, ఆడవారు బ్లాగులు ఖరాబు చెయ్యటం ఎందుకనీ, వయసులో పెద్దదాన్ని కనుక బాధ్యతగా ప్రవర్తించాలనీ,  నా బాధని అణుచుకుంటున్నాను. 

స్వప్నా, నా బ్లాగులో మీరు ఇదివరకు రాసిన కామెంటూ, ఇప్పుడు రాసిన కామెంటూ యధతధంగా పెట్టి, అప్పుడు మీరు చేసినదాంట్లో తప్పేమన్నా వున్నదా అని అందరినీ అడగటమో, లేక సహాయం చెయ్యమని ఎవరికీ చెప్పుద్దని సలహా ఇవ్వటమో చేస్తే నేను చాలా మెచ్చుకునేదాన్ని. నిజాన్ని ఒప్పుకోవటానికి ధైర్యం కావాలి.  నాకు బాధ కలిగించిన మాటల ప్రస్తావన మీ పోస్టులో ఎక్కడా తేకుండా జాగ్రత్త పడ్డారు.  అసలు విషయం తెలియని వాళ్ళు ఎవరికి తోచిన సలహా వారిచ్చారు.  తెలిసినవారు మాట పడ్డారు.

విషయం సరిగ్గా తెలియాలనే ఉద్దేశ్యంతో స్వప్న నా బ్లాగులో చేసిన కామెంట్లు వున్న పోస్టుల లింకు ఇస్తున్నాను.  చూడండి.

http://4psmlakshmi.blogspot.com/2009/09/normal-0-false-false-false.html

http://4psmlakshmi.blogspot.com/2010/03/1.html

ఇప్పుడు చెప్పండి నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానా?


Wednesday, March 3, 2010

మా యాత్రా విశేషాలు-2




మన దేశంలో అయితే ఇంచక్కా రోడ్డు పక్కన భోజనాలు చేశాము


ఇంచక్కా రోడ్డుపక్కే పెద్ద చెట్ల ఊడలు పట్టుకుని ఊగాము

ఏం చేస్తున్నా ఈ విశేషాలన్నీ మీకెలా చెప్పాలా అనే నా ఆలోచనఅందుకే..మర్చిపోకుండా ఎక్కడివక్కడే రాసుకోవటం, ఫోటోలు తీసుకోవటం.
 
 

ఇంక ప్రయాణ సాధనాలంటారా

విమానమెక్కి ఆకాశ మార్గాన ప్రయాణం చేశాం

పడవెక్కి నీటిబాటలో సాగాం

సముద్రతీరాన కారులో షికార్లు చేశాం.

వీటిలో కొన్నింటిని నేనే నడిపాను తెలుసా  మీరు నమ్మరని నాకు తెలుసులెండి...ఇదుగో సాక్ష్యం..


 సేండ్ డ్యూన్స్ డ్రైవ్

ఎలా వుంది నా ప్రతాపం....హహహహహ

అన్నింటినీమించి దేశం కానీ దేశంలో గుర్తింపబడ్డాను.  అమెరికాలో నోవై సెంటర్ సినిమా హాల్లో,  నా బ్లాగు చదివే  శ్రీ వినోద్ బ్లాగులో నా ఫోటోచూసి గుర్తుపట్టి పలకరిస్తే సంతోషంతో గంతులేశాను (ఫోటోల్లేవు).



ఇవ్వండీ మా యాత్రా విశేషాలు.  మరి మా యాత్రలు ఇలాగే కొనసాగాలనీ, మీతో బోలెడు విశేషాలు పంచుకోవాలనీ కోరుకోండి.





Tuesday, March 2, 2010

మా యాత్రా విశేషాలు-1




శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో, 

మచిలీపట్నంలోని 54 అడుగుల సాయిబాబా విగ్రహం
శ్రీ విఘ్నేశ్వరుని అండదండలతో
  మహారాష్ట్ర
 సాగుతున్న మా యాత్రలలో మరచిపోలేని  అనుభవాలు అనేకం.

ఈ యాత్రలలో అనేక సార్లు ఆత్మీయలు తోడు వచ్చినా

ఎక్కువగా కాలి దురదపెట్టేది నాకూ మా శ్రీవారు శ్రీ వెంకటేశ్వర్లకే.


    మెకన్నా ఐలాండ్ లో

మేమిద్దరం కొండలు ఎక్కాం,  కోనల్లో తిరిగాం.

 ప్రసిధ్ధమైనవే కాదు, శిధిలావస్ధలో వున్న దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలు కూడా దర్శించాము.

     నాందేడులోని గురుద్వారా

                      మెదక్ చర్చి

పిల్లలకోసం అమెరికాకి వెళ్ళాం.
అక్కడ గడ్డకట్టే చలిలో వణికాం
మిచిగాన్ లో
బేడ్ లాండ్స్ లో ఎండకి మాడాం.

ఎల్లో పార్కులో గీజర్లు కూడా చూశాము.

డెన్వర్ లోని ప్రపంచ ప్రసిధ్ధికెక్కిన రెడ్ రాక్స్ యాంఫీ ధియేటర్ స్టేజ్ మీద నిలబడి చాలా గొప్పగా భావించాము. 

అందమైన ప్రకతి దశ్యాలను కెమేరాలో బంధించటానికి ప్రయత్నించాము.
 
  
 

అమెరికాలో మమ్మల్ని ఆప్యాయంగా పలకరించిన పసిపిల్లలతో ఆడుకున్నాం.

అంతేకాదు.. అక్కడ బహుమతులు కూడా గెలుచుకున్నాము.
సెడార్ పాయింట్

ఇలా ఒకటా రెండా  ఎన్నని చెప్పమంటారు.  మరి కొన్ని విశేషాలు రేపటి పోస్టులో.  అసలు సర్ ప్రైజులు కూడా అప్పుడే.



Monday, March 1, 2010

నూరవ పోస్టు వేడుకలు....రండి...రండి




ప్రారంభించిన ఇన్నాళ్ళకి నా యాత్ర బ్లాగులో ఈ పోస్టుతో వంద పోస్టులు పూర్తయ్యాయి.  తెలుగులో కేవలం యాత్రలకోసం నిర్ణయింపబడిన బ్లాగు ఇదొక్కటేనేమో (ఇన్ని పోస్టులు వున్నది) అని నా అభిప్రాయం.  ఈ బ్లాగుని ఆదరిస్తున్న అందరికీ ఈ నూరవ పోస్టు వేడుకలకు ఆహ్వానిస్తున్నాను.

సుమ స్వాగతం  (టీవీ యాంకరు కాదండోయ్...ఈ పరిమళ భరిత కుసుమ స్వాగతం) 

అమెరికాలోని హాలండ్ నుంచి తులిప్స్ తో సుస్వాగతం.
 

ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్టీ చేసుకుందాం రండి రండి 
 
 
        నయాగరా జలపాత సోయగాలు

నయాగరా చూసి అలసిపోయారా  ఇదిగో ఈ అమెరికన్ పిజ్జా తినండి.  


 మధ్యలో పాప్ కార్న్ కూడా. అమెరికా, మిచిగాన్  రాష్ట్రంలోని  మెకన్నా ఐలాండ్ కి తీసుకొచ్చానండీ మిమ్మల్ని ఈ పాప్ కార్న్ కోసం.  ఇక్కడ 42 రకాల పాప్ కార్న్, పాప్ కార్న్ ప్రియులనలరిస్తున్నాయి.


అమెరికన్ పిజ్జా తిన్నప్పుడు ఐస్ క్రీమ్ కూడా అమెరికాదేనండీ.  న్యూయార్కునుంచి ఈ ఐస్ క్రీమ్ మీకోసమే.


 మరి ఆరోగ్యంకోసం పళ్ళో...ఇవిగో ఈ పళ్ళు తీసుకోండి.  అతి మధురమైన ఈ పళ్ళు మన దేశంలోవే. 
 
పర్బని,  మహారాష్ట్ర లోని  బత్తాయి తోట

ఏంటో అంటున్నారు....వినబడ్డదిలెండి....పోనీలే అడిగారుకదా అనీ... న్యూయార్కులోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంనుంచి....


అమ్మయ్య..పార్టీ బాగా ఎంజాయ్ చేశారా  ఇప్పుడు మా యాత్రా విశేషాలు...ఇప్పుడు మేము చూసిన ప్రదేశాలకన్నా యాత్రలలో మా విశేషాలు చెప్తాను....ఏమిటి  ఇప్పుడు టైము లేదంటారా  సరే అయితే తరువాత చెబుతాను. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి కొంచెం టీ తాగుతూ. 

విశేషాలు తర్వాత పోస్టులో.  మీ కోసం కొన్ని సర్ ప్రైజస్ కూడా.