Sunday, February 21, 2010

మా ఊరు




గుంటూరు జిల్లాలోని తెనాలి మా ఊరు. మా ఆఫీసులో చేరిన కొత్తల్లో నా ధైర్యాన్ని చూసి ఏ ఊరి అమ్మాయి అని కూపీ లాగారు కొందరు. తెనాలి అమ్మాయి జాగ్రత్త అని సమాధానం విన్నారుట వాళ్ళు. ఆ సంగతి నా దాకా వచ్చినప్పుడనుకున్నాను...మా తెనాలికి ఇంత ఖ్యాతి వుందా...ఆ ఊరినుంచి వచ్చిన అమ్మాయిలంటేనే జాగ్రత్తగా వుంటున్నారే...శభాష్ తెనాలీ అనుకున్నా ఆ రోజు. రెండు రోజుల క్రితం మైల్ లో శ్రీ అనిల్ అట్లూరిగారు తెనాలి గురించి ప్రముఖ రచయిత్రి ఓల్గాగారు వ్రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రిక 16-2-2010 నవ్య అనుబంధంలో ప్రచురించబడినదాని లింకు పంపితే చదివాను. ఎంత గొప్పదో మా తెనాలి అనుకున్నాను మళ్ళీ.
http://bit.ly/Tenali_Sutasramam

1963-64 ల్లో తెనాలిని వదిలి హైదరాబాద్ వచ్చేశాను. ఈ 46 ఏళ్ళల్లో హైదరాబాదుతో అనుబంధాలు పెనవేసుకుపోయి ఇదే మా ఊరు అనుకున్నా, చిన్నతనాన్నీ, పెరిగిన ఊరునీ మర్చిపోలేముకదా. ప్రస్తుతం తెనాలిలో దగ్గరవారెవరూ లేక పోయినా చిన్ననాటి ఆ ప్రదేశం ఎలా వున్నదోనని ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చాము. ఎంత మార్పో. గుర్తుపట్టలేనంత మార్పు.

బయటనుంచీ చూస్తే నేను చదివిన తాలూకా హైస్కూలు చిన్నదయిపోయినట్టు కనిపించింది. కొత్త కట్టడాలవల్ల అనుకుంటాను. దేవీ చౌక్ లోని దేవీ గుడి అలాగే వున్నది. దేవీ నవ రాత్రులు ఎంత వైభవంగా జరిగేవో ఇక్కడ. మేము అక్కడ వున్న కొన్నేళ్ళు సందడంతా మాదే. అలాగే స్వరాజ్ టాకీస్ కి కొంచెం అవతలగా ఆంజనేయ స్వామి దేవాలయం. శ్రీ రామ నవమికి 9 రోజులు చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి అక్కడ.

రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం...మేము వున్నప్పుడు చాలా పాతగా వుండేది. 1911లో ప్రతిష్టింపబడిన ఈ దేవ దేవునికి 76 సంవత్సరాలు వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరగలేదు. 1987 జూన్ నెలలో శ్రీ పినపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారిచే ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. 1988 లో విమాన గోపుర నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం ఇప్పుడు కొత్త రంగులతో తళుకులీనుతోంది.

ఇక్కడే మేమున్న ఇంటికి ఎదురుగూ శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రిగారిల్లు వుండేది. ఆయన చాలా ప్రసిధ్ధికెక్కిన హరికధా భాగవతార్, కర్ణాటక సంగీత విద్వాంసులు.

నాకు తెలియకుండానే అనేక సార్లు తన గుడికి రప్పించుకున్న సాయిబాబా మందిరం...స్వరాజ్ టాకీస్ దగ్గరవుంది. మేమున్నప్పుడు బాబా గర్భ గుడి ముందు విశాలమైన మండపంలాగా వుండేది. సాయంకాలాలు అక్కడ పురాణ కాలక్షేపాలు జరుగుతూ వుండేవి. ఇప్పుడు అక్కడ ధుని, బాబా ఫోటోలు వున్నాయి. మేము వెళ్ళేసరికి మధ్యాహ్న హారతి జరుగుతోంది. ఆ వీధిలో మేమున్న ఇల్లు గుర్తుపట్టలేకపోయాను.

అలాగే వైకుంఠపురం...మే మక్కడవుండగా దేవేరులతో సహా శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహం కొంచెం ఎత్తయిన ప్రదేశంలో పడుకోబెట్టినట్లు వుండేవి. పూజలు జరుగుతూ వుండేవీ. భక్తులు వస్తూండేవారు. ఇప్పుడో చక్కని ఆలయం నిర్మింపబడింది. అనేక ఉపాలయాలు. దైవ దర్శనమే కాకుండా శుభ కార్యాలు గూడా దైవ సమక్షంలో చేసుకుంటున్న భక్తులు... చాలా కోలాహలంగా వుంది.

ఆలయాలు, ఊరు ఎంతో అభివృధ్ధి చెందాయి. కానీ ఎందుకో అవ్వన్నీ మేమున్న సమయంలోనే బాగున్నాయనిపించింది. బహుశా ఆ పరిసరాలు అప్పుడు మాకు పంచి ఇచ్చిన ఆత్మీయతవల్ల అనుకుంటా.

శ్రీ సాయిబాబా దేవాలయం (స్వరాజ్ టాకీస్ దగ్గర)
శ్రీ సాయిబాబా

వైకుంఠపురం
.

Tuesday, February 16, 2010

గోల్డెన్ టెంపుల్, వెల్లూరు




దక్షిణ భారత దేశంలో, తమిళనాడులోని వెల్లూరు దగ్గర తిరుమలైకొడి అనే వూర్లో 3-1-1976న జన్మించిన శ్రీ శక్తి అమ్మ అనే బాలుడు, 1992లో, తన 16వ ఏటనే స్ధాపించిన పీఠం పేరు శ్రీ నారాయణి పీఠం.  సమాజంలో శాంతి స్ధాపనకోసం, పేద ప్రజల జీవన సరళి మెరుగు దిద్దే వుద్దేశ్యంతో అనేక రంగాలలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.   విద్య, ఆరోగ్యం, ప్రకృతి పరిరక్షణ, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పన, వేస్ట్ మేనేజ్మెంట్, ఇలా ఎన్నో రంగాలలో, ముఖ్యంగా గ్రామిణ ప్రజల అభివృధ్ధికోసం ఎన్నో కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహిస్తున్నారు.

మనిషి తన తోటివారికి సహాయపడటం ద్వారా సంతోషాన్ని పెంచగలడు.  తన స్వార్ధాన్ని అధిగమించి ఈ ప్రపంచాన్ని అత్యుత్తమమైన ప్రదేశంగా తీర్చిదిద్దే శక్తి మనిషికి వుంది.  కానీ మనిషి సాధారణంగా మానవ జీవిత విలువల్ని గ్రహించక స్వార్ధ చింతనలో పడిపోతున్నాడు.  మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తించటానికి ప్రేరణ కావాలనే వుద్దేశ్యంతో శ్రీపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణి బంగారు దేవాలయం నెలకొల్పబడింది.

100 ఎకరాల సువిశాలమైన ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం.  ప్రకృతినుంచి అపార శక్తిని విలీనం చేసుకునేందుకు వీలుగా  నక్షత్రం ఆకారంలో నిర్మించబడిన మార్గంగుండా వెళ్తే శ్రీ లక్ష్మీ నారాయణి బంగారు దేవాలయానికి చేరవచ్చు.  వివరాలు తెలియకుండా వెళ్ళిన వాళ్ళకి మనం నక్షత్ర ఆకార మార్గంలో వెళ్తున్నామని తెలియదు.  అసలు ఎంత దూరం నడిచామోకూడా తెలియదు.  ఎండాకాలం, వానాకాలం, ఏ కాలంలోనైనా ఆ మార్గం యాత్రీకుల సేద తీరుస్తూనే వుంటుంది.  చక్కటి గాలి, కనుల విందు చేసే ప్రకృతి సౌందర్యం, హిందీ, తెలుగు, తమిళ. ఇంగ్లీషు భాషల్లో చక్కని సూక్తులు రాసిన బోర్డులు, కొంత దూరం వెళ్ళిన తర్వాత కనుల విందు చేసే బంగారు ఆలయ దృశ్యం, అందమైన అనుభవం.  దోవ పొడుగూతా పూజా ద్రవ్యాలు, కేసెట్స్, పుస్తకాలు వగైరా విక్రయించే దుకాణాలు సంస్ధవారివే యాత్రీకులకు సకల సౌకర్యాలు అన్నీ పరి శుభ్రంగా, అందుబాటులో వున్నాయి.

ఆలయం చట్టూ వున్న కోనేరు పేరు సర్వ తీర్ధం.  భారత దేశంలోని అనేక ప్రసిధ్ధ  నదుల పవిత్ర జలాలు ఈ కొలనులో కలిపారు.  అందుకే దానికాపేరు.

ఈ ఆలయానికి బంగారు రేకు తాపడం చెయ్యటానికి 1 . 5 టన్నుకన్నా ఎక్కువ బంగారాన్ని వినియోగించారు.

బంగారు ఆలయం కనుక విద్యుద్దీపాల కాంతిలో అత్యద్భుతంగా కనబడుతుంది.  మేము మధ్యాహ్నంపూట వెళ్ళాం.  సూర్యకాంతి బంగారు ఆలయం మీదపడి అందంగా మెరిసింది.

ఈ దేవాలయంలోనికి ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకు వెళ్ళనివ్వరు.  సెల్ ఫోన్స్, కెమేరాలు అన్నీ అక్కడ వున్న కౌంటర్లో డిపాజిట్ చెయ్యవలసిందే.  ఎవరి వస్తువులు వారికి విడివిడిగా ప్లాస్టిక్ కవర్లల్లో పెట్టి భద్రంగా తిరిగి అందజేస్తారు.  అంత అందమైన ప్రదేశాల్ని ఫోటోలు తీసుకోలేక పోయామనే బాధ అందరికీ వుండి వుంటుంది.  నేనిచ్చిన ఫోటోలు వారి మేగజైన్ నుంచి తీసినవి.

అంత విశాలమైన ప్రదేశంలో ఎటు వెళ్ళాలా అని ఎవర్నీ అడగక్కరలేదు.  మనం ప్రవేశించిన మార్గాన్ననుసరిస్తే చాలు...దేవాలయంలో కనీసం మూడు గంటలన్నా గడప గలిగితేనే బయల్దేరండి.  ఆ మార్గంగుండా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటానికి పట్టే కనీస సమయం అది.

ఉచిత దర్శనంతోపాటు 250 రూ., 600 రూ., వెయ్యి రూపాయల టికెట్లు కూడా వున్నాయి దర్శనానికి.  వారికీ వీరికీ క్యూలు ఆలయం దగ్గర వేరే వుంటాయి.  ఉచిత దర్శనంవాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి.  అదే టికెట్ కొన్నవారిని అమ్మవారిముంది కూర్చోపెట్టి హారతి ఇస్తారు.  ఇందులోకూడా ఎక్కువ ధరతో టికెట్ కొన్నవాళ్ళుముందు, మిగతావారు వారి వెనక తప్పితే వేరే తేడాలు లేవు.  మిగతా అన్నిచోట్లా అందరూ ఒకటే.

గోల్టెన్ టెంపుల్ కి వెల్లూరు కొత్త బస్టాండునుంచి విరివిగా బస్సులున్నాయి.  ఈ ప్రదేశం చెన్నైనుంచీ 150 కి.మీ., బెంగుళూరునుంచి 200 కి.మీ. దూరంలో వుంది.  అన్ని చోట్లనుంచీ వెల్లూరుకి రైలు, బస్ సౌకర్యాలున్నాయి.

ఇక్కడ గెస్టు హౌస్ లు కూడా వున్నాయి.  అయితే అక్కడ వుండటానికి ముందు రిజర్వు చేసుకోవాలి.



ఫోన్ నెం.  +91.416.220 6500 (10 linesFax  +91.416.220 6666



 

 






Friday, February 12, 2010

మేము చూసిన రెండు కోటిలింగ శివ క్షేత్రాలు




మీరు చదివింది కరెక్టేనండీ.  మన దేశంలో కోటి శివ లింగాలు స్ధాపించాలనే ఉద్దేశ్యంతో రెండు క్షేత్రాలలో మూల విరాట్టులను నెలకొల్పి లింగ ప్రతిష్టలు కొనసాగిస్తున్నారు.  ఆ రెండు క్షేత్రాలనూ చూసే అవకాశం, అదృష్టం మాకు కలిగింది.  మహా శివరాత్రి సందర్భంగా మీ కోసం ఆ వివరాలు.

ఈ రెండు క్షేత్రాలలో ఒకటి మనకి 200 కి. మీటర్ల దూరాన వున్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాలలో 54 ఎకరాల సువిశాల ప్రదేశంలో కంచికచర్ల వాస్తవ్యులు శ్రీ గద్దె ప్రసాద్, పావని దంపతుల సంకల్పంతో మొదలయినది.

ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకి 10 కి.మీ. ల దూరంలో ముక్త్యాల గ్రామంలో   కోటి శివలింగ క్షేత్రాన్ని నెలకొల్పుతున్నారు.  జగ్గయ్యపేట నుంచి బస్సు, ఆటోల సౌకర్యం వున్నది.  (దీనిగురించి జులై 2008లో ఒక పోస్టు రాశాను.  కార్తీక మాసంలో మేమక్కడ వెలిగించిన దీపాల గురించి కూడా అంతరంగ తరంగాలు లో కార్తీక దీపాలు పేరుతో ఒక పోస్టు రాశాను.)  ముఖ్యదైవం శ్రీ పంచముఖ లింగేశ్వరుడితోబాటు ఉపాలయాలుకూడా పూర్తయి నిత్య పూజలు జరుగుతున్నాయి.  108 దేవతలకు ఉపాలయాలు వున్నాయి.  శివలింగ ప్రతిష్టలుకూడా చాలాకాలం క్రితమే వేలల్లో జరిగాయి.  ఇప్పుడా సంఖ్య చాలా పెరిగి వుండవచ్చు.  చాలా అభివృధ్ధి జరిగి వుండవచ్చు. 

ముక్త్యాల లో (ఆంధ్ర ప్రదేశ్) లింగాలకు పానువట్టాలు లేవు.  లింగాలు ఎత్తైన అరుగు మీద కదలకుండా స్ధాపించారు.   
 ప్లాను
దూరంనుంచి ఆలయ సమూహం              
పంచముఖ అమృత లింగేశ్వరస్వామి
 
శ్రీ కామాక్షీ అమ్మవారు
 కార్తీక దీపాలు


 రెండవది కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాలో, బంగారుపేట తాలూక, కమ్మసంద్రంలో  శ్రీ సాంబ శివ మూర్తి అను శివ భక్తుని సంకల్పంతో ప్రారంభమయినది.

శ్రీ కోటి లింగేశ్వరస్వామి దేవస్ధానము, కమ్మసంద్రం, కె.జి.ఎఫ్., కర్ణాటక

కర్ణాటకలోని బంగారుపేట తాలూక, కోలారు జిల్లాలో కమ్మసంద్రంలో వున్నది ఈ దేవాలయం.  శ్రీ సాంబ శివ మూర్తి అను శివ భక్తుడు, ఇక్కడ కోటి శివలింగాలు ప్రతిష్టింప చేయాలనే సంకల్పంతో  ప్రారంభించారు.   1980, అక్టోబర్, విజయ దశమి రోజున  శ్రీ మంజునాధస్వామి ప్రధాన లింగాన్ని ప్రతిష్టించారు.  ఈ క్షేత్రంలో తూర్పు, పశ్చిమ దిశలందు శివుని అష్టోత్తర నామాలతో 108 చిన్న మంటపాలలో శివ లింగములు ప్రతిష్టించబడినాయి.  ఆవరణ అంతా ఎటు చూసినా శివలింగాలే.
వీటన్నింటి నడుమా 108 అడుగుల ఎత్తయిన శివ లింగం, లింగానికి ఎదురుగా 35 అడుగుల ఎత్తయిన నంది చూపరులను ఆకర్షిస్తాయి.   కమ్మసంద్రంలో (కర్ణాటక) ప్రతిష్ట చేసిన చాలా లింగాలు పైకి కనబడటానికి పానువట్టంతో సహా అక్కడ పెట్టినట్లున్నాయి.

లక్ష్మీ విష్ణు, శ్రీ వెంకటేశ్వరస్వామి, మొదలగు అనేక దేవతామూర్తులకే కాక సరస్వతీ సమేత బ్రహ్మకు కూడా ఇక్కడ ఉపాలయాలు వున్నాయి.  అన్ని ప్రధాన దేవతా మూర్తులనూ పుష్పాలతో చాలా అందంగా అలంకరించారు.

పూర్వం ఈ ప్రదేశంలో వాల్మీకి ఆశ్రమం వుండేదని, లవ కుశుల జన్మ ప్రదేశమిదేనని, కధనం.

మధ్యాహ్నం 12 గంటలనుంచి 2 గంటల దాకా ఆలయం తరఫున ఉచిత భోజన ఏర్పాటువున్నది.  భోజనం చేసినవారు వారి ఇష్టప్రకారం అన్నదానానికి విరాళం ఇవ్వవచ్చు.

మేము చిత్తూరునుంచి  కుప్పం వెళ్ళే బస్ లో వి. కోట (వెంకటగిరి కోట) దాకా ఎ.పి.యస్.ఆర్.టి.సీ వారి బస్ లో, అక్కడనుంచీ కె.జీ.ఎఫ్. వెళ్ళే కర్ణాటక బస్ లో ఈ ప్రదేశాన్ని చేరుకున్నాం.  బస్ సౌకర్యం బాగా వుంది.  మేము చిత్తూరునుంచీ ఉదయం 9 గంటలకు బయల్దేరి ఆ క్షేత్రాన్ని దర్శించి తిరిగి సాయంకాలం 5 గంటలకల్లా చిత్తూరు చేరాము.

ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి నెలకొల్పుతున్న ఈ క్షేత్ర దర్శనానికి భక్తులు విశేషంగా వస్తున్నారు.  అయితే మమ్మల్మి బాధపెట్టిన అంశమొకటి.  కొన్ని అష్టోత్తర శివ లింగాల మండపాలు ఊడ్చే చీపుళ్ళు, గోతాలు భద్ర పరిచే ప్రదేశాలయినాయి. అలాగే కింద ఊడ్చిన చీపురుతో శివ లింగాలమీద పూలు, పత్రి  ఊడుస్తున్నారు.  ఇది చూసి బాధవేసి ఆఫీసులో ఆ సమయానికి వున్న ఒక ఉద్యోగినితో చెప్పి వచ్చాము భక్తులకి బాధగా వుంటుంది, వీటిని సవరించమని.
 
  

 
 




Tuesday, February 9, 2010

ఆనంతగిరి




ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదుకి 90 కి.మీ. ల దూరంలో, రంగారెడ్డి జిల్లాలోని వికారాబాదుకి కేవలుం 5 కి.మీ దూరంలో వున్నది ఈ అనంతగిరి. ఇది అటవీ ప్రాంతం. మీరెళ్ళి జంతువులకోసం వెతక్కండి. కనిపించవు. ఇక్కడ ఈ కొండమీద శ్రీ అనంత పద్మనాభ స్వామి వెలిశాడు.

చాలా వేల ఏళ్ళ క్రితం శివ సాక్షాత్కారం తర్వాత మార్కండేయ మహర్షి ఇక్కడ ఒక చిన్న గుహలో తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చిన శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు, మార్కండేయుని కోరికమీద అక్కడ సాలగ్రామ రూపంలో వెలిశాడు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి. ఈ గుహలో ఒక చిన్న ద్వారం కనబడుతుంది. అది కాశీకి సొరంగ మార్గమని, మార్కండేయ మహర్షి ఆ సొరంగంద్వారా రోజూ కాశీకి వెళ్ళ గంగా స్నానం చేసి వచ్చేవాడని చెప్తారు.

ఇక్కడే హైదరాబాదులో ప్రసిధ్ధికెక్కిన ముచికుందానది పుట్టింది. అర్ధంకాలేదా మూసీ నదండీ. ఇప్పుడర్ధమయిందికదా. ఆ కధేమిటంటారా మార్కండేయుడు ఇక్కడ తపస్సు చేస్తున్న సమయంలోనే ముచికుందుడు అనే ఒక రాజర్షి వుండేవాడు. ఆయన ఒకసారి రాక్షసులతో చాలాకాలం యుధ్ధం చేసి వారందరినీ సంహరించాడు. ఆ యుధ్ధంలో చాలా అలసిపోయి విశ్రాంతి తీసుకోదలచి, భూలోకంలో తనకి నిద్రాభంగంకాని ప్రదేశాన్ని చెప్పమంటాడు. అప్పుడు ఇంద్రుడు ఈ ప్రదేశంగురించి చెప్తాడు. ముచికుందుడు ఇకొంచెం జాగ్రత్తపడి, తన నిద్ర ఎవరైనా భంగం చేస్తే, ఆ సమయంలో అతని చూపు ఎవరిమీద పడుతుందో వాళ్ళు భస్మమయిపోవాలని ఇంద్రుడినుంచి వరం పొందుతాడు. ఇంత జాగ్రత్తపడి ముచికుందుడు వచ్చి ఇక్కడ నిద్రపోయాడు.

అది ద్వాపరయుగం. శ్రీకృష్ణుడు కంస సంహారం తర్వాత తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారక మీదకు దండెత్తివచ్చి, యాదవసేనను నాశనం చేసి మధురా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
శ్రీ కృష్ణ బలరాములు అతనిని సంహరించటానికి ముచికుందుడు సరైన వాడనుకుని, వారు కాలయవనునికి భయపడినట్లు నటించి, ముచికుందుడు నిద్రిస్తున్న ఈ ప్రాంతానికి వచ్చారు. వారి వెనకే కాలయవనుడూ వచ్చాడు. శ్రీ కృష్ణుడు తన వస్త్రాలని ముచికుందుని మీద కప్పి తాను పక్కకి తప్పుకున్నాడు. కాలయవనుడు నిదురిస్తున్న ముచికుందుడే శ్రీ కృష్ణుడనుకుని అతనికి నిద్రాభంగం కావిస్తాడు. వెంటనే అతని తీక్షణమైన చూపులకు భస్మమయిపోతాడు.

ముచికుందుడికి శ్రీకృష్ణ బలరాములు ప్రత్యక్షమవుతారు. ముచికుందుడు సంతోషంతో వారి పాదాలు కడుగుతాడు. ఆ నీరే పారి ముచికుందా నదిగా (మన ఇప్పటి మూసీ) పేరుగాంచిందంటారు.

చూశారా మన సమీపంలో వున్న అనంతగిరికి ఎంత పురాణ ప్రఖ్యాతి వుందో. మరింకేం ఒక సెలవురోజు ఈ జనారణ్యానికి దూరంగా ఆ చిట్టడవిలో హాయిగా విహరించి, అక్కడి వృక్షాల వూడలమీద హాయిగా విశ్రమించి, ఊయలలూగి సరికొత్త బలాన్ని పుంజుకునిరండి. అలాగే మార్కండేయుడు తపస్సు చేసిన చిన్ని గుహలోని శ్రీ అనంత పద్మనాభుని సేవించి మానసిక సంతృప్తినికూడా పొందండి.

ఆహారాన్ని తీసుకు వెళ్ళటం మాత్రం మర్చిపోవద్దు.



Monday, February 1, 2010

ఆకట్టుకునే అనంతపురం జిల్లా - 5



లేపాక్షి

ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం వున్నది.  ఆలయం పెద్దది.  ఇందులోనే శివకేశవులకి మందిరాలున్నాయి.  వీరభద్రస్వామి గర్భగుడి ముందు ఒక స్ధంబంలో దుర్గమాత పెద్ద విగ్రహం వున్నది.  స్ధంబాల మీద చెక్కిన శిల్పాలన్నీ చాలా బాగున్నాయి.  ఒక స్ధంబంమీద ఉత్తమ జాతి స్త్రీ (పద్మినీ జాతి) శిల్పం, ఇంకో స్ధంబం మీద ఉత్తమ జాతి పురుషుని విగ్రహాలు చెక్కబడి వున్నాయి.  ఉత్తమ జాతి స్త్రీ పురుషుల శారీరక లక్షణాలు ఎలా వుండాలో ఆ శిల్పాలను చూసి తెలుసుకోవచ్చు.  ఆ విశేషాలు పూజారిగారు వివరించి చెప్పారు. 

గుడి వెనుక ఐదు తలల నాగేంద్రుడి శిల్పం వుంది.  ప్రసిధ్ధికెక్కిన లేపాక్షి బసవన్న విగ్రహం ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో వుంది.  అక్కడ గైడు వున్నారు.    మాలాంటివాళ్ళకోసం ఆలయంలోకూడా గైడు వుంటే బాగుండేదనిపించింది.

ఇవన్నీ చూసి సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి హిందూపూర్ వచ్చి 7 గంటలకి హైదరాబాద్ బస్ ఎక్కాం.

(ఈ సచిత్ర వ్యాసం 31-12-2009 ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురించబడింది.  ఆ సమయంలో నా యాషికా తో తీసిన ఫోటోలు ఆంధ్రభూమి వారికి పంపగా మిగిలినవి కిందటి పోస్టుల్లో పెట్టాను.  అందుబాటులో లేని కారణంగా లేపాక్షి ఫోటోలు ఇవ్వలేకపోతున్నాను.  ప్రస్తుతానికి అనంతపురం జిల్లా యాత్ర సమాప్తం).