Thursday, December 23, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 26



గంగా తీరంలో స్నాన ఘట్టాలు

పావన గంగా నదీ తీరాన వరుణా ఘాట్ నుంచీ అస్సిఘాట్ వరకు 64 ముఖ్యమైన స్నాన ఘాట్లు వున్నాయి.  కొత్తవి ఇంకా కొన్ని చేరాయి.  యాత్రీకుల సౌకర్యార్ధం పడవల వారు ఈ  స్నాన ఘాట్లని చూపిస్తూ, మధ్యలో కొన్ని ముఖ్యమైన చోట స్నానానికి సమయమిస్తూ తిప్పుతారు.  డబ్బు, ప్రయాణీకుల సంఖ్యమీద, వారి బేరం చేసే సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది.  మేము ముగ్గురం  ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 12-30 దాకా ఒక బోట్ లో తిరిగాం, మధ్యలో మణికర్ణికలో మాత్రం ఆగాము.  దానికి 250 రూ. తీసుకున్నాడు.

సాధారణంగా ప్రయాణీకులు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో ఈ ఘాట్ ల సౌందర్యం తిలకించటానికి ఇష్టపడతారుగనుక ఆ సమయంలో రేటు కొంచెం ఎక్కువ వుండవచ్చు.

ఎక్కువమంది  యాత్రీకులు మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచ గంగలలో స్నానం చెయ్యటానికి ఆసక్తి చూపిస్తారు.  వీటిని గురించి కొంచెం వివరంగా........

మణికర్ణికా ఘాట్
పూర్వం మహా విష్ణు తన చక్రంతో ఒక సరస్సు తవ్వి దాని ఒడ్డున మహా శివునికోసం తపస్సు చేశాడు.  శివుడు ప్రత్యక్షమై, విష్ణువుయొక్క తపస్సుని మెచ్చుకుంటూ తలాడించాడట.  అంతే..ఆయన చెవికున్న మణి కుండలం జారి ఆ తటాకంలో పడింది.  సాక్షాత్తూ ఆ మహా ప్రభువు ధరించిన చెవి కుండలం పడిన తటాకం మణకర్ణికా ఘాట్ అయింది.  తరువాత కాలంలో గంగానది ఆ తటాకం మీదనుంచి ప్రవహించిందని కొందరంటారు.  ఈ ఘాట్ లో మెట్లు ఎక్కి పైకి వెళ్తే అక్కడ నలువైపులా రాళ్లతో కట్టబడిన పుష్కరిణి ఒకటి వున్నది.  అదే మహా విష్ణువు చక్రంతో తవ్విన తటాకమని కొందరంటారు.

ముందు గంగానదిలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి పైకి వెళ్ళి ఆ కుండంలో స్నానం చేసి, మళ్ళీ వచ్చి మణికర్ణికా ఘాట్ లో స్నానం చెయ్యాలని మేము వెళ్ళిన బోటు అతను చెప్పాడు.   ఇంకో విశేషమేమిటంటే ఈ ఘాట్ లో స్నానం చెయ్యటానికి మధ్యాహ్నం 12 గం. లకు సకల దేవతలూ వస్తారుట.  అందుకని ఆ సమయంలో అక్కడ స్నానం చెయ్యటం చాలా మంచిది అని చెప్తారు.

ఒడ్డున చిన్న చిన్న దేవాలయాలు వున్నాయి.  కొందరు పితృకార్యాలు చేస్తున్నారు.
 మణికర్ణికా ఘాట్
 చక్ర తీర్ధం

దశాశ్వమేధ ఘాట్
ఇక్కడ బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేశాడుట. అందుకే ఆ పేరు.  ఈ ఘాట్ యాత్రీకులతో ఎప్పుడూ సందడిగా వుంటుంది.  రోజూ సాయంసమయంలో ఇక్కడ గంగ హారతి ఇస్తారు.
 ప్రయాగ మరియు దశాశ్వమేధ ఘాట్స్

హరిశ్చంద్ర ఘాట్
హరిశ్చంద్రుడు కాటికాపరిగా చేసింది ఇక్కడే.  ఇక్కడ శవదహనాలు ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి.  దీని ప్రక్కనే కేదార్ ఘాట్.


కేదార్ ఘాట్
ఈ ఒడ్డునే కేదారేశ్వర మందిరం వున్నది,  ఈ ప్రాంతంలో తెలుగువారు ఎక్కువ వుంటారుట.
 మెట్లకి ఎదురుగా ఒడ్డున కేదారేశ్వర మందిరం (ఎఱ్ఱ బిల్డింగ్ పక్కన)

ఇలా బోట్ లో వెళ్ళేటప్పుడు బోటతను మధ్యలో ఆపి డబ్బులడుగుతాడు, రాములవారు అక్కడే నది దాటారనీ,  ఆయనని తలచుకుని అక్కడ దానమిస్తే పుణ్యమనీ.  బయల్దేరగానే అలా మధ్యలో ఆపి అడిగేసరికి మాకు కోపం వచ్చి ఇవ్వలేదు.  దాంతో అతనికి చాలా కోపం వచ్చి, ముందంతా అన్నీ చెప్పినవాడు తర్వాత ఏమీ చెప్పలేదు.  ఇలాంటి సమయాల్లో ఏం చేస్తారో మీ ఇష్టం.  పుణ్యక్షేత్రానికి వెళ్ళారుకనుక ఎంతో కొంత ఇచ్చేయచ్చు.  వాళ్ళు అల్ప సంతోషులు, పైగా బీదవారు.  అనుభవంతో మాకు తెలిసిందిది.

గంగానదిమీదు పడవ షికారుకి తప్పక వెళ్ళండి.  అన్ని ఘాట్లూ బోట్ లోంచి చూడవచ్చు.  వీలయితే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో బాగుంటుంది.  సమయముంటే సాయంకాలాలు ఘాట్ లో మెట్లమీదకూర్చుని సమయం గడపవచ్చు.
 మేమూ బోటింగ్ చేస్తున్నామోచ్

కాశీలో చూడవలసిన దేవతల గురించి వచ్చే పోస్టులో.


Thursday, December 9, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 25



వ్యాస కాశీ
పూర్వం వ్యాస మహర్షి నివసించిన ప్రదేశమే వ్యాస కాశీ.  వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు వ్రాసిన వాడు.  వేద విభాగము చేసినవాడు.  అంతటి గొప్ప వ్యక్తి తన కోప కారణంగా కాశీనుంచి బహిష్కరింపబడి గంగ ఆవలి ఒడ్డున నివసించాడు.  ఆ కధేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? 
పురాణ కధనం ప్రకారం పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో  కాశీలో వుండి  తపస్సు చేసుకోసాగాడు.  ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది.  మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు.  అలా మూడు రోజులయింది.  ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు.  అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు.  సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి  కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది.  అందుకే వారికి అహంకారం పెరిగి  తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది.  ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు.  మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు.  అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది.  తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది.  మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది.  కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది.  ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు.  వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే పరవడి రోజుల్లో వచ్చి తన దర్శనం చేసుకోవచ్చని అనుమతిస్తాడు.
తర్వాతకాలంలో కాశీ పాలించిన రాజుల కోట అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది.  ఇప్పుడు కోటనంతా మ్యూజియంగా మార్చి పూర్వం కాశీరాజులు వాడిన అనేక సామగ్రిని అక్కడ భద్రపరిచారు.  ప్రస్తుతం ఈ మ్యూజియంకి మైంటినెన్స్ సరిగ్గా లేదనిపిస్తుంది మ్యూజియం శుభ్రత చూస్తే.  మ్యూజియం సందర్శనానికి టికెట్ వుంది.  సమయం ఉదయం 9 గం. ల నుంచి సాయంత్రం 5 గం. ల దాకా.  మధ్యలో ఒకటి రెండు గంటల విరామం వున్నది.





 వ్యాస కాశీ  ప్రవేశ ద్వారమ

గంగకవతల ఒడ్డున రాజుగారి కోట


Wednesday, December 8, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడీ కాశీ కబుర్లు - 24



బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం
ఆసియా ఖండంలోనే పెద్దదిగా భావించబడే ఈ విశ్వ విద్యాలయం పూర్వం కాశీ రాజుగారిచే ఇవ్వబడిన దాదాపు 2000 ఎకరాల సువిశాల క్షేత్రంలో వున్నది.  దీనిని  1916లో పండిట్ మదన్ మోహనమాలవ్యాగారు స్ధాపించారు..  ఏటా 15000 మంది క్రొత్త విద్యార్ధులకి అనేక రంగాలలో ప్రవేశం కల్పించే ఈ విశ్వ విద్యాలయం పేరులో మాత్రమే హిందూ విశ్వ విద్యాలయం.  భారతదేశంనుంచే కాక విదేశాలనుంచికూడా అనేక మంది విద్యార్ధులు కుల, మత ప్రసక్తి లేకుండా ఈ విశ్వ విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. 

 ఈ ఆవరణలోనే బిర్లాలచే నిర్మింపబడిన విశ్వనాధుని ఆలయం వున్నది.  బిర్లాలచే నిర్మింపబడింది కనుక దీనిని బిర్లామందిర్ గా కూడా వ్యవహరిస్తారు.   ఈ పాలరాతి కట్టడం కాశీ విశ్వనాధుని ఆలయాన్ని పోలి వుంటుంది.  కాశీ విశ్వనాధుని ఆలయంలోకి విదేశీయులకు అనుమతి లేదు కానీ ఈ ఆలయంలో స్వామి దర్శనం ఆసక్తిగల ఎవరైనా చేసుకోవచ్చు.


ఇక్కడే భారత కళాభవన్ అనే మ్యూజియంకూడా వున్నది.  సమయాభావంవల్ల మేము చూడలేదు.  అవకాశం వున్నవారు  ఉదయం 11 గం. ల నుండి సాయంత్రం 4 గం. ల వరకు దర్శించవచ్చు.   అయితే విశ్వవిద్యాలయానికి  సెలవు  వున్న రోజుల్లో ఈ మ్యూజియం కూడా మూసివుంటుంది.