Friday, January 20, 2012

వేడిన వరాలిచ్చే వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరస్వామి



వేడిన వరాలిచ్చే వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరస్వామి.


నల్గొండ జిల్లా, మిర్యాలగూడ తాలూక, దామరచర్ల మండలంలో వున్నదీ వాడపల్లి క్షేత్రం . ఇక్కడ కృష్ణా ముచికుందా (మూసీ) నదీ సంగమతీరాన హరిహరులకు బేధంలేదని నిరూపిస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరుడు కొలువుతీరి వున్నారు . నల్గొండ అద్దంకి హై వే లో భీమవరం గుండా వాడపల్లికి చేరుకోవచ్చు.. ఈ రోడ్డులో వున్న ఇండియా సిమెంట్స్ కి ఎదురుగా వచ్చే రోడ్ లోకి తిరిగి అర కిలో మీటర్ వెళ్ళాక ఎడమ పక్క వచ్చే మట్టి రోడ్డు లో వెళ్తే ఈ ఆలయం వస్తుంది.

పూర్వము తీరప్రాంతములో పడవలు నడుపు పల్లెకారులు కట్టుకున్న పల్లె వాడపల్లె కాలక్రమానా వాడపల్లిగా మారింది.

6000 సంవత్సరాలక్రితం అగస్త్య మహాముని తీర్ధయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ కృష్ణా, ముచికుందా నదీ సంగమంలో స్నానంచేసి, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారు. అగస్త్య మహామునిచే ప్రతిష్టింపబడిన లింగంగనుక అగస్త్యేశ్వరుడయ్యాడు. శివ కేశవులకు బేధములేదని అగస్త్య మహాముని ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా ప్రతిష్టించారు. తర్వాత కొంతకాలానికి రక్షణలేని కారణంగా విగ్రహాలచుట్టూ పుట్టలు లేచాయి.

రెడ్డిరాజులకాలంలో ఈ ప్రదేశంలో రెండు వైపుల నీరు, ఒక వైపే త్రోవ వున్నదని గుర్తించి, ఈ ప్రదేశంలో కోట, ఇళ్ళు కట్టుకుంటే సురక్షితంగా వుంటాయనే వుద్దేశ్యంతో బాగు చేస్తున్న సమయంలో లింగాన్ని చూసి, గుడి కట్టించి పూజించసాగారు. రెడ్డి రాజులిక్కడ కోటలు, ఊళ్ళూ నిర్మించుకుని చాలాకాలం పరిపాలించారు. ఆ కాలంలో ప్రసిధ్ధ పట్టణంగా పేరుపొందిన ఈ పట్టణాన్ని అగస్త్యపురము, నర్సింహాపురం, వీరభద్రపురం అను పేర్లతో పిలిచేవారు. 11వందల సంవత్సరాలు సురక్షితంగా వున్న ఈ పట్టణం నిజాం మేనల్లుడయిన వజీరు సుల్తాను ముట్టడిలో సర్వనాశనమైంది. వజీరు సుల్తాను గుళ్ళని మాత్రం ఏమీ చేయలేదు.

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వాడపల్లి

దక్షిణ ముఖంగా వున్న ఈ ఆలయం చిన్నదయినా స్వామి భక్తుల అభీష్టాలను నెరవేర్చే స్వామిగా ప్రఖ్యాతి చెందారు. స్వామి తొడ మీద అమ్మవారు కూర్చుని వున్నట్లు వుంటుంది. గర్భ గుడి లో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం, కింద ఇంకో దీపం వుంటాయి. కిందవున్న దీపం కదలదు. నిశ్చలంగా వుంటుంది. పైన స్వామి ముఖానికి ఎదురుగా వున్న దీపం చిరుగాలికి రెప రెపలాడుతున్నట్లుంటుంది. ఆ కదలికకి కారణం స్వామి వుఛ్ఛ్వాశ నిశ్వాసలని చెపుతారు.

ఈ ఆలయంలో ఒక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు. దుష్టగ్రహ నివారణకోసం అలా చేస్తారుట.

ఈ ఆలయం ఎదురుగా వున్న దోవ లో కొంత దూరం వెళ్తే మీనాక్షి అగస్తేశ్వరాలయం వస్తుంది.

మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, వాడపల్లి:

ఈ ఆలయం తూర్పు దిక్కుగా, సంగమాభిముఖంగా వుంటుంది. గుళ్ళో శివుడి పానుపట్టం ఎత్తుగా వుంటుంది. దానిమీద లింగం ఇంకో రెండు అడుగుల ఎత్తు వున్నది. వెండి కళ్లు, వెండి నాగు పాము పడగ, అలంకరణ బాగుంది. ఈ లింగము మీద ఒక చిన్న గుంటలో ఎల్లప్పుడూ నీరు వూరుతూవుంటుంది. నీటిమట్టానికి అంత ఎత్తునవున్న లింగం పైనుంచి ఎంత తోడినా నీరు ఎలా వస్తోందో, ఎంత లోతులోవున్నదో ఎవరికీ తెలియదు. దానికి సంబంధించిన ఒక కధమాత్రం ప్రచారంలో వున్నది.

క్షేత్ర పురాణం

ఒక రోజు ఒక బోయవాడు పక్షి ని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడుట. బోయవాడు మరి నాకు ఆకలిగా వున్నది ఎలాగ అంటే శివుడు కావాలంటే నా తలనుంచి కొంత మాంసం తీసుకోమన్నాడుట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీదనుంచి మాంసం తీసుకున్నాడుట. ఆ వేళ్ళ గుర్తులు శివ లింగం పైన ఇప్పటికీ కనబడుతాయి. స్వామి శిరస్సున ఏర్పడ్డ గాయం కడగటానికి గంగమ్మ వచ్చిందిట. బోయ కండలు తీసిన చోట ఏర్పడిన గుంటలో ఎప్పుడూ నీళ్లు వుంటాయి. ఆ నీరు ఎక్కడనించి వస్తోందో తెలియదుగాని ఎంత తీసినా ఆ నీరు అలాగే వుంటుందట.

క్రీ.శ. 1524 సం. లో శ్రీ శంకరాచార్యులవారు శిష్యసమేతంగా ఈ ఆలయాన్ని దర్శించారుట. ఆ బిలం లోతు ఎంత వుందో కనుక్కుందామని ఒక ఉధ్ధరిణకి తాడు కట్టి ఆ బిలం లో వదిలారుట. ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలకి వెళ్ళటము చూసి పైకి తీసారుట. ఆ ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నయిట గాని శివయ్య తల మీద గుంట లోతు తెలియలేదుట. శంకరాచార్యులవారు నిన్ను పరీక్షించటానికి నేనెంతవాడను, క్షమించమని వేడుకుని, పూజలు జరిపి వెళ్ళారుట. ఈ విషయంలో శ్రీ శంకరాచార్యులవారు రాయించిన శాసనం (పాళీ భాషలో) దేవాలయంలో ఇప్పటికీ వున్నది.

నదీ సంగమం కనుక ఇక్కడ అస్తికలు నిమజ్జనం చెయ్యటం, కర్మకాండలు కూడా చేస్తుంటారు.

రెండు నదుల సంగమంలో వున్న మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనానికి హైదరాబాదునుంచీ బస్సులున్నాయి. పిడుగురాళ్ళ వెళ్ళే బస్సులు వాడపల్లి మీదనుంచే వెళ్తాయి. రైలు మార్గం మిర్యాలగూడా వరకే. అక్కడనుంచీ బస్ లో వెళ్ళాలి.

ఇక్కడ వసతికీ, భోజనానికి సౌకర్యాలు లేవు. ఒక పెద్ద హాల్ వుంది కాని దానిలో వేరే ఏర్పాట్లేమీ లేవు. వుండటం కొంచెం కష్టమే.

Monday, January 9, 2012

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, సంఘీనగర్, హైదరాబాద్

<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, సంఘీనగర్, హైదరాబాద్

వ్యాపార రంగంలో ప్రసిధ్ధిగాంచిన సంఘీ వంశీయులు తమ సంస్ధలకు సమీపంలో వున్న పరమానంద గిరి అనే కొండమీద ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి
ఆధ్వర్యంలో 25-2-1991 లో శంఖుస్ధాపన జరుగగా, కేవలం 18 నెలల సమయంలో నిర్మాణం పూర్తి చేశారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఏకైక పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గణపతి స్ధపతి ఈ ఆలయాల రూపకర్త. చోళ, చాణుక్య శైలిలో నిర్మింపబడిన ఈ ఆలయాల నిర్మాణానికి స్ధల నిర్ణయం దగ్గరనుంచీ, ఏ ఆలయంఎక్కడ, ఏ పరిమాణంలో నిర్మింపబడాలి వగైరా విషయాలలో శ్రీ గణపతి స్ధపతి శిల్ప శాస్త్రాన్ని నిర్దుష్టంగా అనుసరించారు.

హైదరాబాదుకి 25 కి.మీ. ల దూరంలో వున్న ఈ ఆలయానికి సికిందరాబాదు, కోటీలనుంచి బస్సు సౌకర్యం వున్నది. ప్రధాన రహదారినుంచి ఒక కిలో మీటరు కొండపైకి వెళ్ళాలి. కార్లు పైకి వెళ్తాయి. పెద్ద వాహనాలు కిందనే ఆపాలి. శ్వేత వర్ణంలో అందంగా ఆకర్షించే ఈ ఆలయాలు చేరటానికి సోపాన పంక్తి వున్నది. ఈ మెట్లకి మొదట్లో ఏనుగుల విగ్రహాలు ఆకర్షణీయంగా వుంటాయి. సోపాన మార్గంలో క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. మెట్లెక్కగానే అందంగా చెక్కబడ్డ ముఖ ద్వారం దర్శనమిస్తుంది. దాటి ముందుకు వెళ్తే ముఖ్య ఆలయం శ్రీ వెంకటేశ్పరస్వామిది. ఆలయంలో స్వామి విగ్రహం 9.5 అడుగుల ఎత్తులో అలరారుతోంది. స్వామికి కుడివైపు పద్మావతీ అమ్మవారు తామర పుష్పంలో కూర్చుని, చేతిలో తామర పూవులు ధరించి భక్తులకు దర్శనమిస్తుంది.

ఈ ప్రాంగణంలో శివ, రామ, నవగ్రహాలు, విజయ గణపతి, కార్తికేయ, దుర్గ, అష్టలక్ష్మి, రాధాకృష్ణ మొదలగు దేవతలకి 13 ఉపాలయాలు వున్నాయి.

ప్రశాంత వాతావరణంలో అందంగా తీర్చిదిద్దబడ్డ ఈ ఆలయ సందర్శనానికి శని, ఆదివారాలు, ఇతర సెలవురోజులలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. అందమైస సాయంకాలాలు పట్టణ రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంతంగా నిర్మలమైన వాతావరణంలో గడపాలనుకునేవారు తప్పక చూడవలసిన ఆలయాలు ఇవి.

దర్శన సమయాలు ఉదయం 8 గం. నుంచి 12 గం. లదాకా తిరిగి సాయంత్రం 4 గం. లనుంచి 8 గం. ల దాకా.